నోట్ల రద్దుపై మోడీ ముందే చెప్పారు, మన్మోహన్కు ఇప్పుడూ అవమానం: వెంకయ్య షాక్
విశాఖ: పెద్ద నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీ ముందుగానే మన్ కీ బాత్లో చెప్పారని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కాదన్నారు. విపక్షాలు దీనిని హడావుడి నిర్ణయం అని చెప్పడాన్ని ఆయన ఖండించారు.
త్వరలో స్విస్ బ్యాంకు వివరాలు కూడా వెలుగు చూస్తాయని వెంకయ్య అన్నారు. స్విట్జర్లాండుతో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని చెప్పారు. వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మహాయజ్ఞం నోట్ల రద్దు అన్నారు.
రానున్న రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత పాలకుల వైఫల్యం కారణంగానే నల్లధనం హెచ్చుమీరిందని, అందుకే పెద్ద నోట్ల రద్దు అన్నారు.
మరో ఛాన్స్, దెబ్బకు దెబ్బ: బ్యాంకులో లెక్కలేని డబ్బుపై మోడీ కొరడా
ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా వారి సంఖ్య పెరగదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవిలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానిస్తోందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల ప్రింటుకు 21 రోజులు పడుతుందని, అందుకే కొత్త కరెన్సీ ఆలస్యం అయిందని చెప్పారు.
మహాత్మా గాంధీ తర్వాత నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే అని కొనియాడారు. 'డెబ్భై ఏళ్లుగా దేశంలో జనం అంతా పరిస్థితి ఇంతే.. ఏం చేస్తాం.. మన కర్మ అలా రాసుంది... ఎవరొచ్చినా ఇంతే... ఇది మారదు అనుకుంటూ అవినీతితో ప్రజలు రాజీ పోయార'ని వెంకయ్య అన్నారు.
'కానీ, ఎవరూ ఊహించనే లేదు... ఒకరు వస్తారని (మోడీ), అవినీతి, నల్లధనంపై ఇలాంటి చర్యలు తీసుకుంటారని, మోడీ పెద్ద తిరుగుబాటు దారుడు... రాజీపడేందుకు సిద్ధపడే వ్యక్తి కాదు. పరిస్థితులతో రాజీ పడకుండా, ఆ పరిస్థితులనే మార్చే వ్యక్తి మోడీ' అని కితాబిచ్చారు. నోట్ల రద్దుపై విశాఖలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని, ప్రసంగించారు.