పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు హ్యాండిస్తారా : ప్రధానితో భేటీ పై ఉత్కంఠ..!!
ప్రధానితో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. చాలా కాలంగా బీజేపీ - జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ జరగలేదు. కానీ, ఇప్పుడు విశాఖ కేంద్రంగా ప్రధానితో జనసేన అధినేత భేటీ ఖాయమైంది. ఈ ఇద్దరి మధ్య జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు.. ప్రధాని ఏం సూచిస్తారనేది ఆసక్తి గా మారుతోంది. అధికార వైసీపీ మాత్రం దీని పైన ఒక క్లారిటీకి వచ్చేసింది.
ఇప్పటికే బీజేపీ - జనసేన కలిసి పొత్తుతో వెళ్తున్న వేళ..జనసేన అధినేత తమ రెండు పార్టీలతో పాటుగా టీడీపీకి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతోంది. ప్రధానితో జనసేన అధినేత భేటీ విషయాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకోవటం లేదు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం 2014 ఎన్నికల తరహాలో తిరిగి టీడీపీ - బీజేపీ- జనసేన పొత్తు ద్వారా పోటీ చేయటంతో వైసీపీని ఓడించటం సులువు అవుతుందని భావిస్తున్నారు. అసలు టీడీపీ పైన ప్రధాని మూడ్ ఏంటో తెలుసుకొనేందుకు పవన్ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో పవన్ కు తాము ఇవ్వబోయే ప్రాధాన్యత గురించి ప్రధాని సూచనగా చెప్పే అవకాశం ఉంది.
అయితే, రాజకీయంగా పొత్తులు.. భవిష్యత్ ప్రణాళికల పైన మాత్రం ఢిల్లీలో మరో సమావేశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. టీడీపీతో పొత్తు ప్రతిపాదన పవన్ కూడా నేరుగా ప్రధానికి చెప్పే అవకాశం ఉండదని చెబుతున్నారు. అయితే, ప్రధాని టీడీపీతో పొత్తు అంశంలో సానుకూలంగా లేరనేది బీజేపీ నేతలు చెబుతున్న అంశం. టీడీపీ - జనసేన నేతలు మాత్రం బీజేపీతో కూడా కలిసి వెళ్లటం ద్వారా లక్ష్యం చేరుకుంటామనే అభిప్రాయంతో ఉన్నారు. ఇందు కోసం చంద్రబాబు కూడా చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు.
పవన్ ఈ రోజు ప్రధానితో తన సమావేశం ద్వారా భవిష్యత్ లో మరిన్ని మీటింగ్ లు జరిగేలా చూసుకొనేందుకు ఒక వేదికగా మాత్రమే వినియోగించుకొనే అవకాశం కనిపిస్తోంది. అటు వైసీపీ కూడా ప్రధాని - పవన్ సమావేశం పైన ఆసక్తిగా ఉంది. ఇదే సమయంలో పవన్ ప్రధాని తో మర్యాద పూర్వకంగానే సమావేశం అవుతున్నారని.. పూర్తి స్థాయిలో రాజకీయాలు చర్చకు వచ్చే అవకాశం లేదనేది బీజేపీ నేతల వాదన. దీంతో..మొత్తంగా ప్రధానితో పవన్ భేటీ అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు..అంచనాలకు కారణమవుతోంది.