బ్యారేజీ వద్ద జనమే జనం, జగన్ ఉద్వేగం (పిక్చర్స్)
హైదరాబాద్: భూసేకరణ నష్టపరిహారం, పునరావాసం, ఇతర పనులకు కేవలం రూ.290 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.24 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆరోపించారు.
కృష్ణా, గోదావరి డెల్టాల రైతాంగ ప్రయోజనాలను కాపాడాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబులో అణుమాత్రం కూడా లేదన్నారు. అన్ని విధాల నష్టదాయకం, హానికరమైన పట్టిసీమ ఎత్తిపోతలను కేవలం రూ.300 కోట్ల ముడుపుల కోసమే చేపడుతూ కనీవినీ ఎరుగని రీతిలో రైతాంగాన్ని హోల్సేల్గా అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సముద్రంలోకి నీటిని వదిలే సమయంలో 40 టీఎంసీల నీటిని నిలువ చేసేందుకుగాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పులిచింతల ప్రాజెక్టు చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేశారని, అయితే భూసేకరణ నష్టపరిహారం, పునరావాసం, ఇతర పనులకు కేవలం 290 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే చంద్రబాబు రూ.24 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు.
జగన్
సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు బస్ యాత్ర చేపట్టిన జగన్ గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజీని సందర్శించి నీటి నిల్వలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకం, రైతులను ఉద్దేశించి జగన్ ఉద్వేగంతో మాట్లాడారు.
జగన్
కృష్ణాలో సగటున యేడాదిలో 100 రోజుల పాటు బ్యారేజీ గేటును ఎత్తి నీటిని సముద్రంలోకి వదలాల్సి వస్తోందని, అదే సమయంలో గోదావరి నీటిని తరలించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. బ్యారేజీ వద్ద కేవలం మూడు టిఎంసిలకు మించి నీటిని నిలువచేసే పరిస్థితి లేదన్నారు.
జగన్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 240 టిఎంసిల నీటిని నిలువ చేసుకుని గోదావరి డెల్టా ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందించడమే కాక కుడి కాలువ ద్వారా 80 టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు మరలించవచ్చన్నారు.
జగన్
అటు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు కూడా నీటిని అందించవచ్చన్నారు. అయితే ఈ ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టి ఎత్తిపోతల పథకాన్ని స్వార్థంతో చేపడుతున్నారన్నారు. పైగా రాయలసీమపై కపట ప్రేమను చూపిస్తున్నాడన్నారు.