పోలవరం విలీన మండలాల్లో మళ్ళీ వరద; మోకాళ్ళలోతు వరదనీళ్ళలో నిర్వాసితుల ఆందోళన; అల్టిమేటం!!
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం నిర్వాసిత ప్రాంత ప్రజల పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వందకు పదోవంతు సాయం మాత్రమే అందుతోందని బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ సర్కార్ నుండి స్పందన లేకపోవడంతో దాతలెవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు విలీన మండలాలలోని పోలవరం నిర్వాసితులు.

వరదనీటిలో పోలవరం విలీన గ్రామాల నిర్వాసితుల ధర్నా
ఓ వైపు గోదావరి ముంచెత్తుతూ ఉంటే అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. నిన్నటికి నిన్న చింతూరులో వరదనీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు తాజాగా ఈ రోజు వి ఆర్ పురం లో పెద్ద ఎత్తున వరద నీటిలో ఆందోళన చేపట్టారు. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవిస్తున్న వరదలకు, తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.

వరదలు వస్తే ప్రభుత్వం చేసే సాయం ఇదేనా ?
ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ, కాంటూర్ కాకిలెక్కలు చెబుతూ తమను ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలవరం బాధితులు. ప్రతిసారి వరదలు రావడం అధికారులు నాలుగు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 10 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటైపోయింది అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

న్యాయం చెయ్యకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
ఇక తాజాగా వచ్చిన భారీ వరదలకు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు చెప్పే మాయమాటలు నమ్మే ఓపిక తమకు లేదని వెంటనే ముంపుకు గురైన గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించి బాధల నుండి విముక్తి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సత్వరమే న్యాయం చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది
Recommended Video


పోలవరం ముపు గ్రామాల సమస్యపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన టీడీపీ
మొన్నటి వరదలతో బురద నిండిన ఇళ్లను ఇంకా శుభ్రం చేసుకోక ముందే, మళ్ళీ గోదావరి వరద ముంచెత్తుతోందని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రభుత్వం చూస్తే బురద రాజకీయాల్లో మునిగి తేలుతోందని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయలేని అసమర్థ ప్రభుత్వం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటూ, బాధితులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వంపై దాడికి దిగింది.












Click it and Unblock the Notifications