606 గజాలు తాకట్టు పెట్టి రూ.22 కోట్ల రుణాలు, చిక్కిన రియాల్టర్ దంపతులు
కేవలం 606 గజాల పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఓ రియల్టర్ల దంపతులు ఆ బ్యాంకుల నుంచి దాదాపు రూ.22 కోట్ల రుణాలు తీసుకుని టోపీ పెట్టారు.
విశాఖ: లక్ష రూపాయలు రుణం తీసుకోవాలంటే బ్యాంకు చుట్టు చెప్పులు అరిగేలా తిరగాలి.. అప్పటికీ లోన్ వస్తుందని గ్యారంటీ లేదు. కానీ దర్పం ఉన్న వారికి కోట్ల రూపాయలు అప్పనంగా రుణాలు లభిస్తాయి.
ఇది ఇటీవల వెలుగులోకి వస్తున్న బ్యాంకులకు సంబంధించి వెలుగులోకి వస్తున్న మోసాలు. ఈ క్రమంలో కేవలం 606 గజాల పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఓ రియల్టర్ల దంపతులు ఆ బ్యాంకుల నుంచి దాదాపు రూ.22 కోట్ల రుణాలు తీసుకుని టోపీ పెట్టారు.
విశాఖలోని ఓ కాలనీలో ఉంటున్న మల్యాద్రి, అతని భార్య సుహాసినిలు భాగస్వాములుగా ఎంఎం కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేశారు. వీరికి మధురవాడలో 606 గజాల స్థలం ఉంది. దీన్ని ఎస్బీఐలో కుదువపెట్టి రూ.50 లక్షలు రుణం తీసుకున్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి అదే బ్యాంకులో రూ.33 లక్షల 75 వేల రుణం నాలుగు స్కార్పియో వాహనాలు కొనుగోలుకు తీసుకున్నారు. ఆ తర్వాత అదే స్థలం డ్యాక్యుమెంట్లను మార్పులు చేసి సెంట్రల్ బ్యాంకు నుంచి 5 కోట్ల రుణం తీసుకున్నారు.

అలాగే బ్యాంకు లోనుతో కొనుగోలు చేసిన నాలుగు వాహనాలను తిరిగి ప్రయివేటు ఫైనాన్స్ చేసి మరోమారు రుణం తీసుకున్నారు. అలాగే డ్యాక్యుమెంట్లను ఫోర్జీరీ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 7 కోట్లు, సీతమ్మపేట ఎస్బీఐ బ్రాంచి నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు.
సీతమ్మపేట కెనరా బ్యాంకు నుంచి రూ.80 లక్షలు, ఆంద్రా బ్యాంకు భీమునిపట్నం నుంచి రూ.28 లక్షలు రుణం తీసుకున్నారు. అలాగే అన్ని బ్యాంకుల నుంచి రూ.21 కోట్ల 75 లక్షల రుణం తీసుకుని అన్ని బ్యాంకులకు బకాయిలు పడ్డారు.
ఈ దశలో ఎస్బీఐ ఫిర్యాదు మేరకు మల్యాద్రి, అతని భార్యలను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నకలీ పత్రాలతో భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై మల్యాద్రిని మధురవాడ పోలీసులు అరెస్ట్ చేసి రౌడీ షీటు కూడా తెరిచారు. ఇదిలా ఉండగా, మల్యాద్రి ఇటీవలే హరిబాబు, వెంకయ్య నాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications