వ్యభిచార గృహాలపై దాడి: యువతులు, విటుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని భాగ్యనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కెపిహెచ్బి పోలీసులు సోమవారం దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులతోపాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీధర్ అనే వ్యక్తి భార్య హసీనాతో కలిసి భాగ్యనగర్కాలనీ గ్లోబల్ ఎన్క్లేవ్లోని 404 ఫ్లాట్ని కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నాడు. వీరు ఓ యువతి(22)ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు, దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు విటులు రాము, ప్రకాష్, సందీప్, యువతిని అరెస్ట్ చేశారు. నిందితులందర్నీ రిమాండ్కు తరలించిన పోలీసులు, యువతిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు చెప్పారు.
మరో ఘటనలో గాజులరామారంలో రహస్యంగా కొనసాగుతున్న రెండు వ్యభిచార గృహాలపై జీడిమెట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం రాత్రి పోలీసులు ఈ దాడులు చేశారు.
మల్లారెడ్డినగర్, ఉషోదయకాలనీల్లో సరస్వతి, వెంకటలక్ష్మీ అనే ఇద్దరు మహిళలు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులు, ఇద్దరు విటులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.