coronavirus:మందుల కోసం వెళితే చావకొట్టారు, తీవ్రగాయాలతో యువకుడి మృతి
లాక్డౌన్ సమయంలో ఆస్పత్రి, మెడికల్ షాపునకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కారణం చెప్పి వెళితే.. ఇబ్బంది లేదు. కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు రెచ్చిపోయారు. మందుల కోసం వచ్చిన యువకుడిపై దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక యువకుడు చనిపోయాడు. పోలీసులు దాడిచేయడంతోనే యువకుడు చనిపోయారని బంధువులు ఆరోపించారు. జాతీయ రహదారిపై పోలీసుల తీరును తప్పుపడుతూ నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన మహ్మద్ గౌన్ అనే యువకుడు మందుల కోసం మెడికల్ షాపునకు వచ్చాడు. అతనిని పోలీసులు సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆపివేశారు. ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా.. మందుల కోసం వెళ్తున్నానని సమాధానం ఇచ్చాడు. అయితే లాక్ డౌన్ ఉంది.. తెలియదా అని ప్రశ్నించారు. ఎందుకు తిరుగతున్నావని దాడికి తెగబడ్డారు. యువకుడిపై ముష్టిఘాతం కురిపించడంతో.. ఆ దెబ్బలకు తాళలేకపోయాడు.

పోలీసులు దాడిచేయడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలిపోవడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రమైన దెబ్బలు తగలడంతో అతను ఆస్పత్రిలోనే చనిపోయాడు. పోలీసులు దాడి చేయడం వల్లే గౌస్ చనిపోయాడని అతని బంధువులు ఆరోపించారు. పోలీసు స్టేషన్ వద్ద మృతదేహాంతో ఆందోళన చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత పోలీసులు అధికారులు వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications