రాజమండ్రి తొక్కిసలాట: మంత్రి నారాయణ, బుచ్చయ్య చౌదరి కారణమా?
రాజమండ్రి: రాజమండ్రి పుష్కర ఘాట్ దుర్ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట సంభవించిన మంగళవారంనాడు 27 మరణించిన విషయం తెలిసిందే.
తొక్కిసలాట ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సిసిటీవీ ఫుటేజీని పరిశీలించారు. రెవెన్యూ అధికారులు బారికేడ్స్ తొలగించడం వల్ల ప్రమాదం సంభవించిందని పోలీసులు అంటున్నారు. కాగా, మంత్రి నారాయణ, శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు బారికేడ్లను తొలగించారని అంటున్నారు.
అయితే, ఆ వాదనను బుచ్చయ్య చౌదరి ఖండిస్తున్నారు. నారాయణ, బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకే బారికేడ్లను తొలగించారని పోలీసులు అంటున్నారు. నాలుగు లైన్ల బారికేడ్లలో ఒక్క లైన్ బారికేడ్ మాత్రమే పటిష్టంగా ఉందని, మిగతా మూడు బారికేడ్లను వారి ఆదేశాల మేరకు కలెక్టర్ అరుణ్ కుమార్ తొలగించాలని సూచించారని అంటున్నారు.
తొక్కిసలాట జరగడంతో ఒక లైన్ బారికేడ్ కూలిపోయిందని అంటున్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు ఫోర్ లైన్ బారికేడ్ ఉందని, తాను అటువంటి సూచన ఏదీ చేయలేదని బుచ్చయ్య చౌదరి అన్నారు.