ఆ హత్య చేసింది కొడుకు వరుసయ్యే వ్యక్తే!: మిస్టరీని చేధించిన పోలీసులు
తిరుపతి: తమ పిన్నిని చంపుతామని బెదిరించడంతో పాటు, తన సోదరిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని కొడుకు వరుసయ్యే యువకుడు దారుణంగా హత్య చేశాడు. తిరుపతిలోని ఓ లాడ్జిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బయటకెళ్లి లాడ్జికి తిరిగి వచ్చిన భార్య.. భర్త హత్యకు గురై ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు రోజుల్లోనే చేధించారు.
మృతుడు మణితులి:
లాడ్జిలో హత్యకు గురైన వ్యక్తి పంజాబ్కు చెందిన మణితులి(28) అని తిరుపతి పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రామ్నగర్లో నివాసం ఉండే ఇతను, తిరుపతి చంద్రగిరికి చెందిన యాస్మిన్ అలియాస్ సంజనను వివాహం చేసుకున్నాడని చెప్పారు. అయితే యాస్మిన్ కు అంతకుముందే మణితులి ఇంటి పక్కనే ఉండే మరో వ్యక్తితో వివాహం జరిగిందని, కానీ విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారని అన్నారు. మొదటి భర్తతో విడాకుల తర్వాత యాస్మిన్ ఢిల్లీలోనే ఓ బ్యూటీ పార్లర్ నడిపేదని తెలిపారు.
ఆమెతో వివాహం:
బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న సమయంలోనే మణితులితో యాస్మిన్ కు పరిచయం ఏర్పడి.. కొద్దిరోజులకే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని అన్నారు. కాగా, మణితులి ఓ పేరు మోసిన చైన్ స్నాచర్ అని, అతనిపై ఢిల్లీలో 32కేసులు ఉన్నాయని తెలిపారు. పెళ్లి తర్వాత కూడా దొంగతనాలు మానని మణితులి.. ఆ డబ్బుతో విదేశాలకు వెళ్లి జల్సా చేసేవాడని చెప్పారు. ఇదే క్రమంలో భార్య యాస్మిన్ తో ఎప్పుడూ గొడవపడేవాడని, ఆమెను చంపేస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చారు. యాస్మిన్ అక్క కూతురు మసుదాను కూడా లైంగికంగా వేధించాడని చెప్పారు.
వేధిస్తున్నందుకే హత్య:
అక్క కూతురిపై వేధింపుల పట్ల మణితులిని యాస్మిన్ మందలించినా అతనిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే మణితులి, యాస్మిన్ ఈ నెల 4న తిరుపతికి చేరుకున్నారు. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో వీరు దిగారు. 5వ తేదీన మణితులి, భార్య యాస్మిన్తో పాటు ఆమె అక్క కూతురు మసుదా, అక్క కొడుకు మన్సూర్ అతని స్నేహితుడు తరుణ్కుమార్లు అంతా కలిసి నెల్లూరులోని మైపాడ్ బీచ్ వద్దకు వెళ్లారు. పిన్ని, సోదరుని మణితులి వేధిస్తుండటంతో ఆరోజే అతన్ని హత్య చేయాలని మన్సూర్ స్కెచ్ వేశాడు. కానీ ఆరోజు కుదరకపోవడంతో ప్రయత్నం వాయిదా వేశారు.
లాడ్జిలో హత్య:
మరుసటి రోజు 6వ తేదీ మణితులి లాడ్జిలో ఉన్న సమయంలో మన్సూర్ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటికెళ్లి భోజనం తీసుకొస్తానని చెప్పి యాస్మిన్ చంద్రగిరి వెళ్లింది. గదిలో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించి ఇనుప రాడ్తో అతని తలపై బలంగా దాడి చేశారు. దీంతో మణితులి అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యానంతరం 4గం. వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. యాస్మిన్ పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఆమెను, ఆమె అక్క కూతురిని కూడా విచారించనున్నట్టు సమాచారం.