ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?: నిషిత్ 'యాక్సిడెంట్'పై బెంజ్ కంపెనీకి పోలీసుల లేఖ!
ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఎలాంటి పరిస్థితుల్లో తెరుచుకుంటాయి?, నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి?, మెకానికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలను లేఖలో అడిగారు.
హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ దుర్మరణం.. అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మెర్సిడెజ్ బెంజ్ లాంటి అత్యాధునిక కారులో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేక నిషిత్ వేగమే అతని ప్రాణం తీసిందా? అన్న అనుమానం పోలీసులకు కలిగింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి పోలీసులు లేఖ రాశారు. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఎలాంటి పరిస్థితుల్లో తెరుచుకుంటాయి?, నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి?, మెకానికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలను లేఖలో అడిగారు.
నిషిత్ మరణించిన సమయంలో స్పీడోమీటర్ అతివేగాన్ని సూచిస్తున్నట్లు తేలిన నేపథ్యంలో.. స్పీడోమీటర్ ను ఎంతవరకు లాక్ చేస్తే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యాన్ని పోలీసులు కోరారు.
ప్రమాద సమయంలో నిషిత్ సీటు బెల్టు పెట్టుకోలేదని తెలియడంతో.. సీటు బెల్టుకు ఎయిర్ బ్యాగ్స్ కు ఎలాంటి అనుసంధానం ఉంటుందని పోలీసులు లేఖలో అడిగారు. సీటు బెల్టు పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయా? పెట్టుకోకపోయినా తెరుచుకుంటాయా? అని ప్రశ్నించారు.
కాగా, జూబ్లీహిల్స్ రోడ్ నం.36లొ గత బుధవారం తెల్లవారుజామున 2.45గం. సమయంలో నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మెట్రో పిల్లర్ ను వేగంగా ఢీకొట్టడంతో నిషిత్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవి కూడా అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు.
నిషిత్ వాడిన మెర్సిడెస్ బెంజ్ ఇంపోర్టెడ్ జి-63మోడల్ కారు కావడంతో.. దీనిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మెర్సిడెస్ కార్యాలయానికి లేఖ రాశారు.