మావోయిస్టులు దొరకలేదు...పోలీసులకు డంప్ మాత్రమే దొరికింది!...అసలేం జరిగింది?
విశాఖపట్టణం:ఆదివారం ఏవోబీలో భద్రతా బలగాల కూంబింగ్ లో మావోయిస్టులు దొరికారన్న ప్రచారం వాస్తవం కాదని తెలిసింది. అయితే ఈ కూంబింగ్ లో భద్రతా బలగాలు మావోయిస్టులు తారసపడగా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు వర్గాల సమాచారం.
సకరాయి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం మధ్యాహ్నం దాదాపు 15-20 నిమిషాలపాటు ఈ కాల్పులు జరిగాయంటున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకున్నారని, ఇలా తప్పించుకుపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలతో పాటు అరకు దాడికి పాల్పడిన మావోల యాక్షన్ టీమ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడే...ఎదురు కాల్పులు
సుంకి అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఒడిశా, ఎపి భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్కు దిగాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఇలా సుంకి, పొట్టంగి మధ్య ఏపీకి సమీపంలోని సకరాయి అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులతో ఏవోబీ అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది.
తప్పించుకున్న...మావోలు
అయితే బలగాలు ఘటనా స్థలం నుంచే కాల్పుల సమాచారం ఏపీ డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ డీజీలకు పంపడంతో వారు వెంటనే హెలికాప్టర్లను అక్కడకు పంపారు. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై లిపిటిపుట్టు దాడి నేపథ్యంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుపుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు జరిగిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడం, పైగా మావోయిస్టులు ఉన్న ప్రాంతం కొండకు ఎగువ భాగంలో ఉండటంతో కాల్పులు జరుపుతూ మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారట.
వాళ్లు కూడా...డంప్ స్వాధీనం
ఇలా తప్పించుకు పారిపోయిన వారిలో మావో అగ్రనేతలతో పాటు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హత్య చేసిన యాక్షన్ టీమ్ కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కడి స్థానికులు చెప్పిన పోలికల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కాల్పులు జరిగిన విషయాన్ని ఒడిశా కోరాపుట్ ఎస్పీ విశాల్ కున్వర్ సింగ్, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ధృవీకరించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన బ్యాగులు, దుస్తులు, మందుపాతర్లు, నీళ్ల క్యాన్లు, పాదరక్షలు, మందులను స్వాధీనం చేసుకొన్నాయని తెలిపారు.
విస్తృతంగా...కూంబింగ్
అలాగే తప్పించుకు పారిపోయిన మావోయిస్టులు ఆ పరిసరాల్లోనే ఉండొచ్చని అనుమానిస్తూ ఒడిసా,ఏపీవైపు నుంచి కూంబింగ్ ను విస్తృత స్థాయిలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ గాలింపులో దీంతో ఒడిసా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో పాటు ఏపీకి చెందిన గ్రేహౌండ్స్, ఏపీఎస్పీతోపాటు బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. వీరికి అవసరమైతే సహాయంగా మరిన్ని హెలికాప్టర్లు, అదనపు బలగాలను పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.