పోలీసుల ఒత్తిడి.. 'నో నో నో' అన్న అమరావతి రైతులు!
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చేరుకుంది. యాత్రకు ఆదివారం విరామం ప్రకటించారు. తిరిగి సోమవారం కొవ్వూరు నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమండ్రి మల్లయ్యపేటకు చేరుకుంటుంది. రైల్ కమ్ రోడ్ వంతెనపై ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అమరావతి రైతులు తమ యాత్రను ఈ మార్గంలోకి మార్చారు.
కొత్త మార్గంలోకి యాత్ర వెళుతుండటంతో ఎంతమంది యాత్రలో పాల్గొంటారో స్పష్టతివ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీచేయబోయారు. అయితే వాటిని తీసుకునేందుకు అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు తిరస్కరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు కో-కన్వీనర్ తిరుపతిరావును నోటీసు తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. తాము న్యాయస్థానం అనుమతితో యాత్ర నిర్వహిస్తున్నామని, ఏమైనా చెప్పదల్చుకుంటే న్యాయస్థానం ద్వారా చెప్పాలని కోరారు. అప్పటికీ నోటీసులు తీసుకోవాలంటూ పోలీసులు మరోమారు ఒత్తిడి చేయడంతో పాదయాత్ర పొడవునా అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని, ఇంకా ఇంకా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ కొవ్వూరు టౌన్ సీఐ రవికుమార్ కాళ్లపై తిరుపతిరావు పడబోయారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు.
అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పాదయాత్ర గత నెల 12వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటికి 34 రోజులు పూర్తయ్యాయి. మొత్తం 60 రోజులపాటు 600 కిలోమీటర్ల దూరం.. అసెంబ్లీ నుంచి అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం విశాఖటప్నంలో విశాఖ గర్జన నిర్వహించింది.