AP Election: ఏపీ ఎన్నికల ఫలితాలపై యోగీంద్ర యాదవ్ జోస్యం ! మెజార్టీ వారికే..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈసారి గెలిచే పార్టీలపై భారీగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. జూన్ 4 జరిగే కౌంటింగ్ లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా సాగుతున్నాయి. అయితే ఆలోపే మన రాష్ట్రంతో పాటు జాతీయ స్ధాయిలోనూ ఏపీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఎవరికి మెజార్టీ లోక్ సభ సీట్లు దక్కనున్నాయనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కామెంటేటర్ కూడా అయిన యోగీంద్ర యాదవ్ తన జోస్యం చెప్పేశారు. ఈసారి జాతీయ స్ధాయిలో బీజేపీకి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ రావడం లేదని జోస్యం చెప్పిన యోగీంద్ర యాదవ్.. ఈ విషయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలతో విభేదించారు. ఎన్నికల విశ్లేషణల్లో పేరున్న యోగీంద్ర యాదవ్ ఏపీలో ఏం జరిగిందో చెప్పేశారు.

ఈసారి ఏపీలోని 25 లోక్ సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 15 సీట్ల వరకూ ఎన్డీయే కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని యోగీంద్ర యాదవ్ విశ్లేషించారు. కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించలేకపోతున్న బీజేపీ.. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన వంటి వారిపై ఆధారపడాల్సి వస్తుందని తేల్చేశారు. అంతే కాదు ఏపీలో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని, అలాగే దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనకు కలిపి 12 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో యోగీంద్ర యాదవ్ జోస్యంపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications