చింటూ గొడవను వాడుకున్నారా: అనురాధ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందా?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. హత్యకు సూత్రధారి చింటూయేనా? రాజకీయ కుట్ర దాగి ఉందా? దుండగులకు సహకరించిందెవరు? కటారి మోహన్ - చింటూల మధ్య ఉన్న గొడవను ఇంకెవరైనా ఉపయోగించుకున్నారా?.. ఇలా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ముఖ్యంగా మేయర్ హత్యోదంతంలో చింటూ పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సికె బాబు అనుచరుల పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నట్లు డిజిపి జేవీ రాముడు చెప్పారు.
చింటూ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. చింటూకు, కటారి మోహన్కు ఎక్కడ విభేదాలు వచ్చాయి, చింటూకు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. చింటూ సన్నిహితుల నుంచి పోలీసుల వివరాలు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
చింటూకు, కటారి మోహన్ కుటుంబానికి మధ్య గల ఘర్షణను ఎవరైనా వాడుకున్నారా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. చింటూను ఇటీవల ఎవరెవరు కలిశారనే విషయమై సమాచారం సేకరిస్తున్నారు.
మరోవైపు, మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చింటూ, మోహన్ మధ్య హత్య చేసే స్థాయిలో గొడవలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
చింటూ ఇంట్లో దొరికిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, చిత్తూరు నగర పాలక సంస్థలోని సిసి కెమెరాలను ఎవరెవరు కట్ చేశారనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. సిసి కెమెరాల్లో ఎలాంటి మరమ్మతులు లేవని, కాబట్టి ఉద్దేశ్య పూర్వకంగానే వైర్లను కట్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.