రాజధాని లేని అధోగతికి రాష్ట్రం; బిల్లుల ఉపసంహరణ జగన్ రాజకీయ కుట్ర : ఎంపీ కనకమేడల
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లులను తాత్కాలికంగా రద్దు చేస్తూ, మళ్లీ సమగ్రంగా మెరుగైన బిల్లును ప్రవేశపెడతామని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత గందరగోళానికి గురిచేసింది . అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీనిని రద్దు చేస్తున్నామని మళ్లీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తామని ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నాము కానీ మూడు రాజధానులు కాదంటూ ఏపీ మంత్రులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు జరిగి తీరుతుందని, నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, వెనక్కు తగ్గేది లేదని వైసిపి నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ను మరింత గందరగోళం తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు.

న్యాయం గెలుస్తుందన్న భయంతో బిల్లుల ఉపసంహరణ
వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ వెనుక అతి పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. కోర్టులను తప్పుదారి పట్టించారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లును వెనక్కి తీసుకునేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందన్న భయంతో జగన్ మోహన్ రెడ్డి ఈ చర్యకు పాల్పడ్డారని కనకమేడల అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కి పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు పట్టాయని, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ దాదాపు తప్పులతడకలేనని కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు.

జగన్ దుర్బుద్ధిని ఖండిస్తున్నాం
వికేంద్రీకరణ బిల్లు రద్దు స్వాగతిస్తున్నామని కానీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక దుర్బుద్ధి ఉందని పేర్కొన్న కనకమేడల, సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్భుద్ధిని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారని మరి ఆ ప్రకటనపై ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందో చెప్పాలని కనకమేడల డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లెజిస్లేచర్ ను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా ఏపీ రాజధాని అమరావతినే
20-1- 2020 న ఆంధ్ర ప్రదేశ్ గెజిట్లో డీ సెంట్రలైజేషన్ యాక్ట్, సీఆర్డీఏ బిల్లు రిపీల్ బిల్లు తీసుకొచ్చారని మొదటి శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి దానిపై ఎక్స్పర్ట్ కమిటీ కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ కమిటీ వేశారని చెప్పారు. ఆయా కమిటీలు నివేదికను ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రభుత్వం ముందుంచాయని పేర్కొన్నారు ఎంపి కనకమేడల. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఏపీ రాజధానిని మార్చలేరని స్పష్టం చేశారు.
Recommended Video

తప్పు ఒప్పుకోండి..ప్రజలు క్షమిస్తారు: ఎంపీ కనకమేడల
పార్లమెంట్ లో జరిగిన చర్చకు విరుద్దంగా రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా ఆర్గనైజేషన్ యాక్ట్ కు భిన్నంగా వ్యవహరించడం ఎవరి వల్లా కాదని ఎంపీ కనకమేడల స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని కనకమేడల పేర్కొన్నారు. తప్పును గ్రహించకుండా కోర్టులను మోసం చేయాలని చూస్తే ఫలితం అనుభవిస్తారని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు రాజీనామా చేసేవాడని, కానీ వీరికి ఎలాంటి నైతిక విలువలు లేనందున అలా చెయ్యరు అని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో మళ్లీ గందరగోళాన్ని సృష్టించడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజధాని లేని అధోగతికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఎంపీ కనకమేడల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications