కుప్పంలో జగన్ ఎత్తుకు చంద్రబాబు పై ఎత్తు!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం. ఇక్కడి నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు విజయకేతనం ఎగరవేశారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పంపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి..
అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇక్కడి నుంచి చంద్రబాబుపై పోటీపడే భరత్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. బాధ్యతలన్నీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. స్థానికంగా బలమైన నాయకులను వైసీపీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇటీవలే చంద్రబాబు కుప్పం పర్యటన అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పదుల సంఖ్యలో టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లి వారిని పరామర్శించి వచ్చారు. టీడీపీ న్యాయ విభాగంద్వారా వారందరికీ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.
ప్రతి ఇంటికీ వెళ్లి జియో ట్యాగింగ్
వీరంతా నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది? ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఏం చేయాలి? వెన్నుపోటు పొడిచినవారు ఎవరు? పార్టీలో కోవర్టులెవరు? టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు.. తదితరాలన్నింటిపై పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిద్వారా ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల్లో 75వేల కుటుంబాలున్నాయి. పార్టీశ్రేణులంతా యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా యాప్ రూపొందించిన టీడీపీ
నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలతోపాటు కుప్పం పట్టణం కలుపుకొని 2,18,933 మంది ఓటర్లున్నారు. ఓటరు జాబితాలోని వివరాలు.. ఇంట్లోని ఓటర్లకు సంబంధించిన వివరాలను క్రోడీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో ఓటర్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేకంగా యాప్ ను సైతం రూపొందించారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తమ ఫోన్లలో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఎంత మంది ఓటర్లున్నారు? ఒక ఇంట్లో ఉంటున్నారా? వేర్వేరుగా నివసిస్తున్నారా? వేరే ప్రాంతంలో ఉంటే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏ చిన్న తప్పు జరగకూడదన్న ఉద్దేశంతో నాయకులు పనిచేస్తుండగా దీన్ని చంద్రబాబునాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.