అందులో ఏముందో మాకు చెప్పొచ్చుగా..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించడం, దాన్ని అధికార పక్షం ఖండించకపోవడంతో దాదాపుగా ముందస్తే వస్తాయని అందరూ స్పష్టతకు వస్తున్నారు. ఈ తరుణంలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలంతా తమ దృష్టిని సర్వేలపై నిలిపారు. వైసీపీకానీ, టీడీపీకానీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నాయి. ఆ నివేదికల్లో ఏముందో తెలుసుకోవడానికే నాయకులంతా వారి వారి ప్రయత్నాల్లో మునిగిపోయారు.
ఈ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి? తమకు గెలుపు అవకాశాలున్నాయా? ప్రత్యర్థి పార్టీల పరిస్థితి ఏమిటి? ఒకవేళ సీటు రాకపోతే ప్రత్యర్థి పార్టీలో అవకాశం ఉంటుందా? అక్కడ గెలవడానికి అవకాశం ఉందా? తదితర విషయాలన్నీ నేతలను కుదురుగా ఉండనీయడంలేదు. రానున్న ఎన్నికలు రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యలా మారాయి. దీంతో ఏ పార్టీకా పార్టీ కచ్చితంగా గెలవడానికే చూస్తోంది. అందుకే గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా నిలపడానికి ప్రయత్నిస్తున్నాయి.

వైసీపీలో దాదాపుగా అందరు ఎమ్మెల్యేలకు జగన్ పచ్చజెండా ఊపారు. పనితీరు మార్చుకోనివారిని చివరి నిముషంలో సీటు నిరాకరించే అవకాశం కనపడుతోంది. సర్వేలో తమకు సానుకూలత లేదన్నా, సీటు రాదనే సమాచారం ఉన్నా బలమైన పార్టీలో చేరదామనుకుంటూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. కొందరు తమ ప్రత్యర్థి పార్టీల నేతల్లోకి అందుబాటులోకి వస్తున్నారు.
ఏదేమైనప్పటికీ అంతిమంగా ఆయా పార్టీల నాయకుల భవిష్యత్తును సర్వేలే తేల్చబోతుండటంతో అందులో తమగురించి ఏముందో తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నాయకులు ఎత్తులు, వారి ప్రణాళికలు చూస్తుంటే సీటుంటే ఈపార్టీ.. సీటు రాకపోతే పక్క పార్టీలోకి జంప్ అవుదామనే యోచనలో ఉన్నారు. కానీ పక్కపార్టీలో సీటు వస్తుందా? రాదా? అనేది ఖాయం చేసుకున్న తర్వాత గోడదూకే అవకాశం కనపడుతోంది.












Click it and Unblock the Notifications