ఏపీలో ముందస్తు ఎన్నికలు, ఢిల్లీ సంకేతాలు - పొత్తులపై ఎఫెక్ట్..!?
కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ పరిణామాలతో అమరావతిలో లెక్కలు మారుతున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సమయంలో తీసుకొనే నిర్ణయాలు ఏపీ రాజకీయలపైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సంకేతాలతో డిసెంబర్ - జనవరిలోనే లోక్ సభకు ఎన్నికలు జరుగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ ఎన్నికలు అప్పుడే జరగున్నాయి. అదే జరిగితే పొత్తులు - ఎత్తులు కొత్త టర్న్ తీసుకోనున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం: ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారికంగా బులెటిన్ విడుదల అయింది. ఈ సమావేశాల్లోనూ జమిలి ఎన్నికల బిల్లు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. ఆ బిల్లు ఆమోదం వెంటనే సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో లోక్ సభకు ముందస్తు ఎన్నికలపైన కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.

రామ్నాథ్ కోవింద్ కమిటీని నియమించిన కేంద్రం, విధి విధానాలు ఖరారు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల దిశగా కావాల్సిన ఐదు రాజ్యాంగ సవరణలు చేయడం.. సగం రాష్ట్రాల ఆమోదం పొందడమూ సులువు కాదనే వాదన ఉంది. దాంతో, దశలవారీగా ఈ ఆలోచనను అమలు చేయాలని కోవింద్ కమిటీ ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకునే అవకాశముందని చెబుతున్నారు.
లోక్ సభతో పాటుగా ఏపీ ఎన్నికలు: ఈ డిసెంబరు నుంచి వచ్చే డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సిన పది నుంచి 12 రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు కలిపి పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండగా, వచ్చే ఏడాది మే- డిసెంబరు మధ్య ఆంధ్రపదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిసా, సిక్కిం, హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
వచ్చే ఏడాది మే-డిసెంబరు మధ్య ఎన్నికలు జరపాల్సిన అసెంబ్లీలకు ముందస్తుకు సంబంధించి పెద్దగా ఇబ్బందులుండవని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ, ఈ ఏడాది నవంబరు- డిసెంబరుల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీలకు సంబంధించి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మారుతున్న రాజకీయ లెక్కలు: ఈ నేపథ్యంలో, లోక్సభతోపాటు పది, 12 రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబరు- జనవరిల్లోనే ఎన్నికలు జరిపేలా కేంద్రం పావులు కదుపుతోందని సమాచారం. అదే జరిగితే ఏపీలోనూ డిసెంబర్ - జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఎం జగన్ ఒంటరి పోరుకు సిద్దం కావటంతో తాము ఎన్నికలు వచ్చినా రెడీగా ఉన్నామని వైసీపీ చెబుతోంది. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా, ఇంకా బీజేపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఇదే సమయంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే ప్రతిష్ఠాత్మక బిల్లుల ఆమోదంలో వైసీపీ పాత్ర కీలకం కానుంది. దీంతో, అటు వైసీపీని కాదని ఇప్పటికిప్పుడు పొత్తుల కోసం టీడీపీతో బీజేపీ చేతులు కలుపుతుందా అనేది సందేహమే. ఈ సమయంలోనే పొత్తల్లో సీట్ల సర్దుబాటు మరో ప్రధాన అంశం. దీంతొ, మందస్తుగానే ఎన్నికలు వస్తే ఏపీలో మొత్తం సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications