AP Power crisis: పరిశ్రమలకూ పవర్ షాక్ .. విద్యుత్ కోత; వెయ్యి మెగావాట్ల సర్దుబాటుకు జగన్ సర్కార్ కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్తు సంక్షోభం వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరత ఏర్పడడంతో పాటు, కేంద్రం నుండి రాష్ట్రానికి సహకారం కూడా అందకపోవడంతో ఏపీలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఏపీ లోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించడానికి ఇప్పటికే ప్రజలను ఏసీలకు బదులు ఫ్యాన్లు మాత్రమే వినియోగించండి అని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు కరెంట్ కోతలను మొదలుపెట్టింది.
తెలంగాణాకు లేని విద్యుత్ సమస్య ఏపీకే ఎందుకు? జగన్ సర్కార్ కు చంద్రబాబు, టీడీపీ నేతల ప్రశ్నల వర్షం
పరిశ్రమలకు కోత విధించే ఆలోచనలో విద్యుత్ సంస్థలు
ఏపీలో కరెంట్ కోతలకు తెర తీసిన ప్రభుత్వం లోడ్ సర్దుబాటు కోసం గ్రామాల్లో రోజు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో గంట పాటు కరెంటు కోత విధిస్తోంది. అయినప్పటికీ ఏపీ విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించడం కోసం పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ లో కూడా కోతలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివిధ పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతున్న డిస్కం లు
విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయంలో సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకునేలా వివిధ పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. అంటే సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ ను పరిశ్రమలకు కోత విధించడం ద్వారా సర్దుబాటు చెయ్యాలని కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. పరిశ్రమలలో ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా అదనంగా వినియోగించే కరెంటును పొదుపు చేయాలని సూచిస్తుంది. విద్యుత్ పొదుపు చేయడానికి ఏసీలు ఇతర అనవసరమైన వినియోగాన్ని తగ్గించాలని, కేవలం ఉత్పత్తికి మాత్రమే విద్యుత్ ను వినియోగించాలని సంప్రదింపులు జరుపుతుంది.
పరిశ్రమల నుండి 1000 మెగావాట్ల సర్దుబాటు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు రాష్ట్ర విద్యుత్ డిమాండ్ లో రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటుంది. దీనిని అధిగమించడం కోసం ఒక 1000 మెగావాట్ల విద్యుత్తును పరిశ్రమలలో సర్దుబాటు ద్వారా వినియోగం తగ్గించి, మరో 1000 మెగావాట్ల విద్యుత్తును అదనపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే పరిశ్రమల నుండి విద్యుత్ సర్దుబాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కరోనా కారణంగా కుదేలైన పరిశ్రమలు .. కరెంట్ కోతలపై విముఖత
మొన్నటి వరకు కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమలు మూతపడగా, కోవిడ్ పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కోలుకుంటున్నాయి. ఈ సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే పరిశ్రమలు కోలుకునే పరిస్థితి ఉండదని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. కరెంట్ కోతలపై విముఖత వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ కు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పని నడిపించాలంటే డీజిల్ ధరలు పెరగడంతో అదనపు భారం అవుతుందని లబోదిబోమంటున్నాయి.
తీవ్ర సంక్షోభంలో పారిశ్రామిక వర్గాలు
ఓ సాధారణమైన కంపెనీకి ఒక రెండు గంటల పాటు జనరేటర్ ను ఉత్పత్తి నిమిత్తం వినియోగిస్తే కనీసం 30000 రూపాయలు అదనంగా భరించాల్సి వస్తుందని వారు లెక్కలు చెబుతున్నారు. విద్యుత్ ఖర్చుతో పోలిస్తే దాదాపు పది రెట్లు అదనంగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అసలే కరోనా మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయి పరిశ్రమలు, ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తుంటే పరిశ్రమలకు కోత విధించి విద్యుత్ ను సర్దుబాటు చేయాలని చూడటం దారుణమని వారంటున్నారు.
Recommended Video
జెన్కో నుండి అదనపు ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్న ఏపీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ కొలిక్కి రావడానికి మరో నెల రోజుల పాటు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క జెన్కో ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి పెంచుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంకో పక్క విద్యుత్ పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. పరిశ్రమలకు కోత పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బొగ్గు కొరత తీరి ఉత్పత్తి పెరిగే వరకూ ప్రజలకు, పారిశ్రామిక వర్గాలకు కరెంటు కష్టాలు తప్పేలా లేవని తెలుస్తుంది.