రాళ్ల దాడి తర్వాత పవర్ కట్: చిరునామా గల్లంతవుతుందంటూ చంద్రబాబు హెచ్చరిక
తిరుపతి: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం చిత్తూరు జిల్లా సత్యవేడులో తిరుపతి లోక్సభ ఉపఎన్నిక అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
మొన్న రాళ్ల దాడి.. నేడు కరెంట్ కట్..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఉన్మాదుల చిరునామా గల్లంతవుతుందని హెచ్చరించారు. సభా ప్రాంతంలో కరెంట్ కట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్ల దాడి చేశారని.. ఇవాళ కరెంటు నిలిపివేశారని మండిపడ్డారు. తాను వెళ్లిన చోట కరెంట్ కట్ చేయాలని ఆదేశాలిచ్చారని ఆరోపించారు.
బాధితులే దొంగలను పట్టించాలా?
సభలో రాళ్లు వేస్తే దానికి తానే ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరడం..బాధితులే దొంగలను పట్టించాలనే రీతిలో ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు ఇచ్చింది పార్టీ టీడీపీనేనని అన్నారు.
కేసుల కోసమే ఎంపీలను అమ్ముకున్నారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? ప్రత్యేక హోదా కోసం ఎంపీలను గెలిపించాలని కోరారు. తన కేసుల కోసం ఇవాళ ఎంపీలను అమ్ముకున్నారంటూ సీఎం జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మి దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. తన పోరాటం పదవి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తిరుపతి ఉపఎన్నికను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కొడాలి నాని లాంటివారేనా మహిళలకు రక్షణ కల్పించేది?
'ఒక మంత్రి స్థానం లో ఉన్న కొడాలి నాని దళిత మహిళ అని చూడకుండా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ గారిని హేళనగా, కించపరుస్తూ మాట్లాడడం అతనికి, వైసీపీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో తెలుస్తుంది. వీళ్లా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేది. వీళ్లా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేది' అంటూ టీడీపీ చేసిన ట్వీట్ ను నారా లోకేష్ రీట్వీట్ చేశారు.