ఏపీలో విద్యుత్ కోతలు: అసమర్ద సీఎం జగన్ వల్లే.. టీడీపీ ఫైర్, రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో గంటలతరబడి విద్యుత్ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. శీతాకాలంలో కూడా విద్యుత్ కోతలా అంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రామా దిశగా ఎమ్మెజీనాల్యే రోజా..? నగరిలో ఏం జరుగుతోంది..!!
రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీగా కరెంటు కోతలు చోటుచేసుకున్నాయి. ఇటు రాయలసీమ ప్రాంతంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందలకు పైగా విద్యుత్ సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లుగా సమాచారం.
అప్రకటిత విద్యుత్ కోతలపై టీడీపీ ఫైర్
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అప్రకటిత విద్యుత్ కోతలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అసమర్థ సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వలన ఒక చేతిలో దీపం... మరో చేతిలో విసిన కర్ర పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ట్విట్టర్ వేదికగా టిడిపి మండిపడింది. చలి కాలంలోనే 8 గంటలు కట్ చేస్తున్నారంటే ఇక వేసవిలో దబిడి దిబిడే అంటూ పేర్కొంది. ఇక ఇదే సమయంలో ఏ చోట విన్నా... జగనన్న సున్నా అంటూ టిడిపి ట్విటర్ లో పోస్ట్ చేసింది.
జాతీయ్ గ్రిడ్ కు బకాయిలు చెల్లించకపోవటం వల్లే ఈ విద్యుత్ కోతలు .. టీడీపీ ధ్వజం
జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగనన్న విద్యుత్ కోతల పథకాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేస్తున్నారు. జాతీయ్ గ్రిడ్ కు బకాయిలు చెల్లించకపోవటం వల్లే ఈ విద్యుత్ కోతలని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అంధకారంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన బాట
ఇదిలా ఉంటే అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మంగంపల్లి సమీపంలో రైతులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. చిన్నంపల్లి గ్రామానికి చెందిన రైతులు అప్రకటిత విద్యుత్ కోతల వల్ల తాము తీవ్రంగా పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
డిమాండ్ కు తగ్గట్టు లేని ఉత్పత్తి .. సరఫరాపై అందుకే ఒత్తిడి
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాలంలోనూ కరెంటు కోతలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది డిమాండ్ సరఫరా లో భారీ వ్యత్యాసం రావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు విద్యుత్ కోతలకు గురయ్యాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను రెండో రోజు కూడా నిలిపివేసింది. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి సంస్థల్లో 5010 మెగావాట్లకు గానూ, 1947 మెగావాట్ల మేరకు ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఒక్కసారిగా పడిపోయిన విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రంలో సరఫరాకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీంతో అటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల లోనూ విద్యుత్ కోతలు మొదలైన పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎండాకాలంలో ఏ విధంగా ఉండబోతుందో అన్న భావన ప్రజల్లో వ్యక్తమౌతుంది.