అమరావతికి వేల కోట్ల నిధులు.. లెక్కలు తేల్చిన కేంద్రమంత్రి
దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి, ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. విజయవాడ భవానిపురంలోని వాజపేయి పార్క్ వద్ద నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిలతో కలిసి ఆయన పార్కులో మొక్కలు నాటారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్కుకు వచ్చిన స్థానిక వాకర్స్తో కలిసి కాసేపు వాకింగ్ చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. 2014కు ముందు దేశంలో పదేళ్ల పాటు ఆర్థిక వ్యవస్థ అత్యంత క్షీణస్థితిలో ఉండేదని గుర్తుచేశారు. కానీ నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని, దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, తెలంగాణలోనూ ఇదే తరహా అభివృద్ధి పథంలో కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతోందని వివరించారు.

అమరావతి రాజధానికి నిధుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు అమరావతి ప్రాధాన్యతను ప్రధాని మోదీకి వివరించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ.15,000 కోట్లు కేటాయించిందని, హడ్కో (HUDCO) ద్వారా మరో రూ.11,000 కోట్లు అందించామని వెల్లడించారు. అమరావతిని కనెక్ట్ చేస్తూ నిర్మించబోయే ప్రత్యేక రైల్వే లైన్ కోసం కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కేంద్రమంత్రి అభినందించారు.
కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే సుజనా చౌదరి
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పార్కుకు విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానిపురం, క్రాంబ్వే రోడ్డులోని కుండల బజార్ కాలనీవాసులు, మహిళలు కలిసి వినతిపత్రం సమర్పించారు. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, మురుగునీరు రోడ్లపైకి చేరి తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
దీనిపై సుజనా చౌదరి సానుకూలంగా స్పందిస్తూ.. కుండల బజార్ డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని హామీ ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ (VMC) ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనాలను కూడా రూపొందించామని, అతి త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా మురుగు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన మాస్టర్ ప్లాన్తో పనులు చేపడతామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications