Bangladesh Power Crisis: ఇంకా చీకట్లోనే బంగ్లాదేశ్..! జనం దాడులు- కొత్త సర్కార్ కు చుక్కలు..!
బంగ్లాదేశ్ లో (Bangladesh) రెండు రోజుల క్రితం తలెత్తిన విద్యుత్ సంక్షోభం (Power Crisis) తీవ్రమవుతోంది. గ్యాస్ టెర్మినల్ లో సమస్య కారణంగా ఎల్ఎన్జీ నిలిచిపోవడం, దేశంలో గ్రిడ్ కుప్పకూలే పరిస్ధితికి చేరుకోవడంతో మొదలైన ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం మాల్స్, షాపులు, వ్యాపార సంస్థల్ని రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు. మరోవైపు భారత్ నుంచి డీజిల్ కోరుతూ ఇప్పటికే బంగ్లా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే మరోసారి బంగ్లాలో ప్రజా తిరుగుబాటు తప్పేలా లేదు.
బంగ్లాదేశ్లో విద్యుత్ సంక్షోభం (Bangladesh Power Crisis) ఊహించని రీతిలో తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిపోవడంతో తాత్కాలిక ఉపశమనం కోసం తారిఖ్ రెహ్మన్ ప్రభుత్వం దేశంలోని అన్ని నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, ఇతర దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీనికి తోడు గంటల తరబడి సాగుతున్న విద్యుత్ కోతలు ప్రజల జీవితాన్ని నరకప్రాయంగా మార్చాయి. ఈ నేపథ్యంలో స్దానిక విద్యుత్ స్టేషన్లపై ప్రజలు పలు చోట్ల దాడులకు దిగుతున్నారు. దీంతో ఆరు నెలల క్రితమే ఏర్పడిన ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి.

కరెంట్ కష్టాల నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమవుతున్నారంటూ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ పై విమర్శ దాడి తీవ్రతరం చేసాయి. దేశంలో అప్రకటిత కరెంట్ కోతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తగినంత ఇంధన లభ్యత లేకపోవడం వల్లనే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, ఈ సంక్షోభం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వం తేల్చిచెప్పేస్తోంది. ఈ కష్టాలు తొలగిపోవడానికి కనీసం మరో వారం రోజుల సమయం పట్టవచ్చని చెప్తున్నారు. దీంతో భారత్ బంగ్లాదేశ్ కు ఉన్న ప్రత్యేక పైప్ లైన్ ద్వారా పంపే డీజిల్ కోసం అక్కడి ప్రభుత్వం ఎదురుచూస్తోంది.














Click it and Unblock the Notifications