విజయవాడపై బీజేపీ గురి: టీడీపీ నేతల విలవిల
TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.
ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.

పొత్తు కుదిరిన ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గంపై బీజేపీ కన్నేసినట్టే కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని తమకు కేటాయించేలా చంద్రబాబుపై పార్టీ హైకమాండ్ నుంచి ఒత్తిడిని తీసుకొస్తోన్నట్లు సమాచారం. అన్ని షరతులకూ చంద్రబాబు అంగీకరించిన నేపథ్యంలో- దీనికీ తల ఊపడం లాంఛనప్రాయమే కావొచ్చు.
ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న ప్రసాద్ వీ పొట్లూరి.. బీజేపీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. త్వరలోనే వైఎస్ఆర్సీపీకి గుడ్బై చెప్పబోతోన్నారు. దేశ రాజధాని వేదికగా కాషాయ కండువాను కప్పుకోనున్నారు.
తాను బీజేపీలోకి వెళ్లబోతోన్నాననే సంకేతాలను సైతం ఇచ్చారు పీవీపీ. తన అధికారిక ఎక్స్ అకౌంట్లో బయోడేటాలో మార్పులు చేశారు. తన పేరు పక్కన.. మోదీ కా పరివార్ (మోదీ కుటుంబం) అనే క్యాప్షన్ను జోడించారు. కొంతకాలంగా బీజేపీ నాయకులందరూ కూడా తమ ఎక్స్ అకౌంట్లల్లో మోదీ కా పరివార్ అనే క్యాప్షన్ను జత చేస్తూ వస్తోన్నారు. తాజాగా పీవీపీ అదే జాబితాలో చేరారు.
నమో నమామి అంటూ నరేంద్ర మోదీకీ జైకొట్టారు. మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. దశాబ్ద కాలంలో దేశ దశ, దిశ మార్చిన ధీశాలిగా అభివర్ణించారు. దేశం కోసం అమిత్ షా అహర్నిశలు పని చేశారని, జేపీ నడ్డాది అసమాన వ్యక్తిత్వం అంటూ ప్రశంసించారు. వారి తోడ్పాటుతో ఏపీని రక్షించడానికి ప్రతిపక్షాలు జట్టు కట్టాయని అన్నారు.
చంద్రబాబును తెలుగు రాష్ట్రాల దిక్సూచి, సమర్ధతకు మారు పేరు అంటూ కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ను తెలుగు పౌరుషానికి ప్రతినిధిగా అభివర్ణించారు. వారి పోరాటాలతో.. ఏపీకి ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. అందరూ సుఖాపడాలి నంద నందనా అంటూ ట్వీట్ను ముగించారు.
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన విజయవాడ లోక్సభ స్థానంపై బీజేపీ కన్నేయడం, ఆ పార్టీ తరఫున పీవీపీ పోటీ చేయడం దాదాపు ఖాయం కావడం.. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లోలానికి దారి తీస్తోంది. ఈ సీటు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కేశినేని చిన్నికి నిరాశ తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications