ప్రశాంత్ కిషోర్ గుడ్ బై - ఇక నడిపించేదెవరు : టీడీపీకి అడ్వాంటేజ్ అదే...!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ప్రధాని మోదీని గెలిపించటంలో కీలక పాత్ర పోషించిన సమయం నుంచి ఆయన దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. వరుసగా అనే క రాష్ట్రాల్లో అక్కడి పార్టీలు అధికారంలోకి రావటంలో రాజకీయ వ్యూహకర్తగా సేవలందించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పని చేసారు. జగన్ - ప్రశాంత్ కిషోర్ కాంబో ఏపీలో సూపర్ హిట్ అయింది. ఫలితంగా వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు - 22 లోక్ సభ సీట్లు సాధించింది.

టీఆర్ఎస్ కు పీకే దూరంగా
పశ్చిమ బెంగాల్ - తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తన సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన ఐ ప్యాక్ మాత్రం రాజకీయంగా కన్సల్టెన్సీగా కొనసాగుతోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
ఇదే సమయంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దగ్గరయ్యారు. స్వయంగా ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పని చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ -ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కలిసి ప్రాజెక్టుల సందర్శన.. ఫాం హౌస్ లో సమావేశాలకు హాజరయ్యారు. కానీ, ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఆలస్యం అవుతోంది. అయితే, అనూహ్యంగా కేసీఆర్ జాతీయ పార్టీ వ్యవహారాలకు ప్రశాంత్ కిషోర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలను కొనసాగిస్తున్నారు.

ఏపీలో జగన్ కోసం పని మొదలు
ఐ ప్యాక్ టీం నుంచి రిషి సింగ్ వైసీపీకి వ్యూహకర్త గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, రిషి టీం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కీలక సమాచారం సీఎం జగన్ కు అందిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలకు హాజరయ్యే కార్యకర్తల ఎంపిక బాధ్యత ఐప్యాక్ టీం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో పధకాల అమలు.. ఎమ్మెల్యేల పని తీరు..ఏ నియోజకవర్గంలో ఏ రకమూన మార్పులు చేయాలనే దాని పైన ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తోంది. ఇదే సమయంలో అటు టీడీపీకి ప్రశాంత్ కిశోర్ సహచరుడు రాబిన్ శర్మ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
ఆయన గతంలో 2014 ఎన్నికల సమయంలో పీకే టీం సభ్యుడుగా జగన్ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో పని చేసారు. రాబిన్ శర్మకు వైసీపీ అధినేతకు సంబంధించిన వ్యూహాల తీరు .. బలాలు- బలహీనతల పైన అవగాహన ఉంది. అది ఇప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఏపీలో సీఎం జగన్ - చంద్రబాబు ముందుగానే ఎన్నికలకు పార్టీలను సంసిద్దులను చేస్తున్నారు.

టీడీపీలో మొదలైన నిర్ణయాలు
ఇదే సమయంలో రాబిన్ శర్మ వర్కింగ్ స్టైల్ - చంద్రబాబు వ్యూహాల పైనా ఐ ప్యాక్ - సీఎం జగన్ కు పూర్తి అవగాహన ఉంది. ఈ రకమైన పోటీయే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ - టీడీపీ పోటా పోటీ ప్రచారం - ఎత్తులు- కౌంటర్లకు కారణమవుతోంది. ఎన్నికల సమయానికి ఈ వ్యూహాలు మరింత పదునెక్కనున్నాయి.
ఇప్పటికే జగన్ సామాజిక సమీకరణాల ద్వారా టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పొత్తులు - సీట్ల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని సీట్లకు ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కొత్తగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. దీంతో..ఈ రాజకీయ వ్యూహాల పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications