బుజ్జమ్మ ఎవరో తెలీదు.. 190 ఎకరాల రాజారెడ్డిని తప్పించారేం? సీఐడీ కేసులపై మాజీమంత్రి ప్రత్తిపాటి ఫైర్
రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటిరోజే ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలపై టీడీపీకి చెందిన మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుపై ఐపీసీ 420, 506, 120 బీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందా గురువారం కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మ అనే మహిళ.. తన 99 సెంట్ల భూమిని అప్పటి మంత్రులు బలవంతంగా లాక్కున్నాని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ముందుకుకదిలింది. రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న ఈ వ్యవహారంపై ప్రత్తిపాటి స్పందించారు.
ఆ పేరు కూడా వినలేదు..
సీఐడీ ఎఫ్ఐఆర్ లో రాసినట్లు బుజ్జమ్మ అనే మహిళ ఇంట్లోకి వెళ్లడం, బలవంతంగా భూమి కొనడం లాంటివేవీ తనకు సంబంధంలేదని, ఎవరో కొన్న భూములకు పేర్లు లింకప్ చేసి ఏ2, ఏ3గా పేర్కొనడం అన్యాయమని మాజీ మంత్రి పుల్లారావు చెప్పారు. బుజ్జమ్మ అనే పేరు కూడా వినలేదని, బహుశా ల్యాండ్ పూలింగ్ సమయంలో ఎవరింటికైనా వెళ్లుంటానో గుర్తులేదని, అయితే అసైన్డ్ భూములు కొన్నారన్న ఆరోపణ మాత్రం అవాస్తవమన్నారు.
వైసీపీ నేతల భూముల సంగతేంటి?
అభివృద్ధి చేస్తారని ప్రజలు జగన్ ను సీఎం చేస్తే, ఆయన మాత్రం ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధించడానికే కాలమంతా వెళ్ళదీస్తున్నారని, అందుకోసం అధికార యంత్రాంగాన్ని పావులా వాడుకుంటున్నారని, వైసీపీ నేతలతోపాటు, అధికారులపైనా న్యాయపోరాటం చేస్తామని పుల్లారావు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని పదే పదే చెబుతోన్న సీఎం జగన్.. అమరావతిలో భూములు కొన్న వైసీపీ నేతల పేర్లను మాత్రం తెలివిగా తప్పించారని, రాజారెడ్డి అనే వైసీపీ వ్యక్తి 190 ఎకరాలు కొనుగోలుచేసినా ఆయనపై విచారణ జరగడంలేదని మాజీ మంత్రి ఆరోపించారు.
నాకు బినామీలు లేరు..
ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని తన బినామీగా పేర్కొనడాన్ని పుల్లారావు ఖండించారు. సురేశ్ తో పరిచయంగానీ, లావాదేవీలుగానీ లేవన్నారు. అక్రమ కేసులు పెట్టినంతమాత్రాన, టీడీపీ నేతల నోళ్లు మూయించినంతమాత్రాన రాజధాని ఉద్యమం ఆగిపోదని, కేసులు పెట్టినవాళ్లు, నమోదుచేసిన ఉన్నతాధికారులు కూడా రేపు కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనని, శిక్షలు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు.
సీఐడీ దూకుడు..
అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేస్తోన్న సీఐడీ ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులతోపాటు 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ తెల్లరేషన్ కార్డుదారులంతా ఒక్కో ఎకరానికి మూడు కోట్లు చొప్పున చెల్లించి మొత్తం 761 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.