కీలక మలుపు: సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు దూరం: ఆ యూనియన్ కీలక ప్రకటన
అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సమ్మెలో తాము పాల్గొనట్లేదని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక యూనియన్ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన సమ్మెను తాము సమర్థించట్లేదని పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి పీఆర్సీ సాధన సమితి నాయకులు ఆసక్తి చూపట్లేదని ఆరోపించింది.
ఎందుకు మద్దతివ్వాలి..
అలాంటప్పుడు వారు ప్రతిపాదించిన సమ్మెకు తాము మద్దతు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం వైఎస్ఆర్ ఎంప్లాయిస్ యూనియన్.. ఈ సమ్మెను బహిష్కరించింది. తాము విధులకు హాజరవుతామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. తమ యూనియన్లో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ సమ్మెలోకి వెళ్లరని రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ప్రధాన కార్యదర్శి అబ్రహాం తెలిపారు.
విధులకు హాజరవుతాం..
అన్ని జిల్లాల డిపోల్లో తమ యూనియన్ సభ్యులు సమ్మెలో పాల్గొనట్లేదని, విధులకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించిపోతేనే.. సమ్మె ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజా రవాణా స్తంభించినప్పుడే సమ్మె తీవ్రత ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు.
వారి సమ్మెతో సంబంధం లేదు..
ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉద్యోగులు తమను సమ్మెలో భాగస్వామ్యులు కావాలని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ రకంగా వారు తమను వాడుకోవాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. మిగిలిన ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా సమ్మెను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఏవీ లేవని చెప్పారు.
ఉసిగొల్పే ప్రయత్నం..
ప్రజారవాణా విభాగం ఉద్యోగులకు పిక్సేషన్, క్యాడర్, ఫిట్మెంట్, ఇళ్ల స్థలాలు ఏ మేరకు ఇస్తారో ఇప్పటిదాకా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ఎవ్వరూ తమకు వివరించనే లేదని చల్లా చంద్రయ్య అన్నారు. వారి స్వార్థం కోసం సమ్మెకు ఉసిగొల్పడం సమంజసం కాదని చెప్పారు. పీఆర్సీ సాధన సమితి స్వార్థ రాజకీయాలకు ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయనే విషయం ఆ సంఘాల నాయకులకు కూడా తెలియదని పేర్కొన్నారు.
సమస్యలను చర్చల ద్వారా..
ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్, ఫిక్సేషన్ అమలు చేయాల్సి ఉందని, కార్పొరేషన్లో కొనసాగించిన పాత పింఛన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని చల్లా చంద్రయ్య చెప్పారు. ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో ఉన్న 19 శాతం మేర వ్యత్యాసం ఉందని, దాన్ని వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర అలవెన్సుల బకాయిలు చెల్లించాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని చెప్పారు.