గొడుగుల కిందే గర్బిణీల కాన్పులు; అధ్వానంగా ఆ ప్రభుత్వాసుపత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షం కారణంగా చోటుచేసుకున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆసుపత్రుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తడిసి ముద్దయ్యింది. ఆస్పతిలో రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది.
ఆస్పత్రిలో గొడుగులు పట్టుకుని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి
ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆసుపత్రి లోపల గొడుగులు పట్టుకొని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఇద్దరు గర్భిణీ స్త్రీలకు గొడుగులు కిందనే ప్రసవం చేసారు ఆసుపత్రి వైద్యులు. ఆస్పత్రి స్లాబ్ పెచ్చులూడి, రిపేర్లు చేయకుండా ఉండడం వల్ల, స్లాబ్ నుండి నీళ్ళు కారుతుంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో ఆసుపత్రి లోపల కనీసం నిల్చోలేని పరిస్థితి తయారైంది. ఆసుపత్రి భవనం స్లాబ్ శిథిలావస్థకు చేరుకుని కురుస్తుండటంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరమ్మత్తు పనులు చెయ్యకనే ఆస్పత్రిలో ఇబ్బందులు
నాడు నేడు పనులలో భాగంగా 45 లక్షలు రూపాయల ఖర్చుతో పనులు చేపడుతున్నట్టు సంవత్సరం క్రితం ప్రకటించి, మరమ్మతు కార్యక్రమాలను ప్రారంభించి అర్ధాంతరంగా వదిలేయడంతో ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రతిరోజు వందలాది మంది రోగులు, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వచ్చే పోయే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు గర్భిణీ స్త్రీలు డెలివరీకి ఆసుపత్రికి వచ్చారని, ఆసుపత్రి భవనం మొత్తం కురుస్తుండడంతోఆసుపత్రి లోపల గొడుగులు పట్టుకొని గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేసిన దుర్భరమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు.
ఆస్పత్రిలో గొడుగుల క్రిందే డెలివరీలు
ఆస్పతిలో గొడుగుల క్రింద బిడ్డలు పుట్టిన కొంతసేపటికే కరెంట్ పోయిందని చెప్తున్నారు. జనరేటర్ లేకపోవడంతో ఇన్వర్టర్ కూడా ఒకగదికే పరిమితం అవ్వడంతో ప్రసవానికి వచ్చిన పేషెంట్ లతోపాటు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులపై సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సిఎం సొంత మండలం లోనే ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఈవిధంగా ఉంటే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు.
ప్రజలు ఏం పాపం చేశారో జగన్ చెప్పాలి: ప్రశ్నించిన సీపీఎం నేత
దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ప్రజలు ఏం పాపం చేశారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 150 సీట్లతో ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇది తగునా అంటూ మండిపడ్డారు . ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిరుపేద గిరిజనులు వైద్యం చేయించుకోలేని దయనీయమైన పరిస్థితి ఉందని మండిపడ్డారు. వైద్య సిబ్బంది కష్టపడి వైద్యం చేయాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదన్నారు.మందులు తడిపోవడం వలన రోగులకు పనికి రాకుండా పోతున్నాయని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం సొంత మండలంలోనే ఇంత దారుణ పరిస్థితులా?
మండలం కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటున్న డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు రోజు వందలాది మంది పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ముందెప్పుడూ లేవని పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్యం వైపు ప్రజలను మళ్లించే క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వెంటనే ఆసుపత్రిని మరమ్మతులు చేయించి, నిరుపేదలైన వారికి వైద్యం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.