నిండు గర్భిణి మృతి: అర్టీసీ బస్సు- లారీ ఢీ, 4గురు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్లకు సమీపంలో జానపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రంపచోడవరంలో నిండు గర్భిణి మృతి
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నిండు గర్భిణి ఆదివారం కన్నుమూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంపచోడవరానికి చెందిన చెందిన కళావతి అనే మహిళకు నెలలు నిండాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయం నొప్పులు వస్తుండటంతో ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సు ఇంజక్షన్ చేసింది. అనంతరం కళావతి చనిపోయినట్టు ఆమె భర్త, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో సరైవ వైద్యం అందకపోవడం వల్లనే కళావతి చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
కాకినాడలో ఉన్న కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కూలీగా పని చేస్తున్న లోవరాజు(27) సిలిండర్లలో కెమికల్ మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అమోనియం గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ సమయంలో సమీపంలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.