శ్రీశైలంలో రాష్ట్రపతి ముర్ము-ప్రత్యేక పూజలు, ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం- గవర్నర్ తమిళిసైతో కలిసి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లిఖార్జునుడిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సున్నిపెంట చేరుకున్న రాష్ట్రపతి, అక్కడి నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ముందుగా రత్న గర్భ గణపతి స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లు.. తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవార్లకు కుమార్చన జరిపించుకున్నారు. అనంతరం భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాలను, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్రపటాల జ్ఞాపికను అందజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శనం తర్వాత ప్రశాద్ ప్రోగ్రామ్ కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. రాత్రికి నందినికేతన్ అతిధి గృహంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడిది చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు రాష్ట్రపతితో కలిసి శ్రీశైలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.