ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతి రాక....డిసెంబర్ 7,8 తేదీల్లో విశాఖ పర్యటన
అమరావతి: భారత దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఆయన వెంట ఉంటారు.

ఎపికి రాష్ట్రపతి రాక...
డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ ఎయిర్ఫోర్స్ కార్యాలయం ఐఎన్ఎస్ డేగాకు విచ్చేస్తారు. ముందుగా ఎయిర్ క్రాప్ట్ మ్యూజియంను రాష్ట్రపతి ప్రారంబిస్తారు. ఆ తరువాత సాయంత్రం 5గంటలకు ఆంధ్రయూనివర్సిటీలో రూ.9కోట్ల వ్యయంతో నిర్మించనున్న స్టార్టప్ కంపెనీ భవన సముదాయాలు ఈ-క్లాస్ రూం కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం విశాఖ నగరంలోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ మెమోరియల్ స్కూల్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అ పాఠశాల విద్యార్ధులతో రాష్ట్రపతి ముచ్చటిస్తారు.

నౌకాదళం స్టాంపుల విడుదల...
అంబేద్కర్ మెమోరియల్ స్కూల్ లో కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం తూర్పునౌకాదళంలోని గెస్ట్హౌస్కు వెళ్తారు. అక్కడ తూర్పునౌకాదళ సబ్మెరైన్ అధికారుల బృందం ఏర్పాటు చేసేన నేవీ స్టాంపులను విడుదల చేస్తారు. జలాంతర్గామి విభాగం ఏర్పాటై 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్టాంపులను విడుదల చేయనున్నారు.

విందు..బస..ఏర్పాట్లు
అనంతరం రాత్రి నౌకాదళంలోని రాజ్పుథ్లో రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు. ఈ విందులో ఆయనతో పాటు సిఎం, గవర్నర్ పాల్గొననున్నారు. ఆ తరువాత రాత్రి ఇఎన్సిలోనే రాష్ట్రపతి బస చేస్తారు.

రెండో రోజు పర్యటన...వీడ్కోలు...
8వ తేదీన ఉదయం 8 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి కోవింద్ తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.












Click it and Unblock the Notifications