రైతులకు శుభవార్త.. ప్రతినెలా రూ.3వేలు పొందే అవకాశం
ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వృత్తిలో ఉన్నవారైనా... ఇలా ఎవరైనా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైరవక తప్పదు. ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకోక తప్పదు. వారికి కంపెనీలు నెలనెలా పెన్షన్ చెల్లిస్తుంటాయి. ఇలా అందరికీ పెన్షన్ వస్తుంది. కానీ మనకు అన్నంపెట్టే రైతన్నకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితి ఏమిటి? ఆ వయసులో కూడా కష్టపడాల్సిందేనా? ఇంటిదగ్గర ఉంటే పెన్షన్ లా ఆదాయం వచ్చే మార్గం లేదా?.. సరిగ్గా కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచన చేసింది. రైతులకు కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఉండాలి అని భావించింది.
రైతు మరణిస్తే అతని భార్యకు
'ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన' పేరుతో ఓ పథకాన్ని తెచ్చింది. 60 సంవత్సరాల వయసు నిండిన ప్రతి రైతు నెలనెలా రూ.3వేలు అందుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతుల కోసం దీన్ని రూపొందించారు. వృద్ధాప్యంలో వారికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని తెచ్చింది. 18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుండి, 5 ఎకరాల్లోపు రైతులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరిన రైతు మరణిస్తే అతని భార్యకు లేదంటే భర్తకు ఈ పెన్షన్ అందిస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వో, ఎన్ పీఎస్ తదితర పథకాల్లో ఉన్నవారు ఇందులో చేరడానికి అనర్హులు.

ప్రతినెలా రూ.55 నుంచి రూ.200 వరకు
ఈ పథకంలో చేరిన రైతు తనకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది పూర్తికాకుండా రైతు మృతిచెందితే అతని భార్య దీన్ని కొనసాగించుకోవచ్చు. నెలకు మూడువేల రూపాయలు కావాలనుకున్నవారు 18 సంవత్సరాల వయసులో రూ.55, 40 సంవత్సరాల వయసులో రూ.200 డిపాజిట్ చేసుకుంటూ రావాలి. సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఫోన్ నెంబరుతోపాటు ఇతర వివరాలన్నీ అందజేసి పథకంలో చేరొచ్చు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications