నడిరోడ్డుపై నిలిచిన బస్సు: రాత్రంతా జాగారం
విజయవాడ: ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల సమయంలోనే కాకా అకారణంగానూ ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్వవహరిస్తున్నాయి.
ఇలాంటి సంఘటన మంగళవారం విజయవాడలోని వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కాకినాడ నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరిన దీపక్ ట్రావెల్స్ వోల్వో బస్సు అర్ధరాత్రి విజయవాడలోని బందరు రోడ్డులో నిలిచిపోయింది.
డ్రైవర్ బస్సును ఎందుకు నిలిపివేశాడో తెలియక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నిలిచిపోయిన బస్సు మంగళవారం ఉదయం దాకా కదలకపోవడంతో ప్రయాణీకులు బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ప్రయాణీకులు రాత్రి నుంచి నడిరోడ్డుపైనే జాగారం చేస్తున్నారు.
దీపక్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో, తమను వేరొక బస్సులో హైదరాబాద్కు తరలించాలంటూ ప్రయాణీకులు అక్కడే, నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.