ఒక్కడి కోసం 142 కోట్ల మందిని పణంగా పెడతారా ? తొలి స్పీచ్ లో నిప్పులు చెరిగిన ప్రియాంక..!
వాయనాడ్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇవాళ పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. లోక్ సభలో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థల్ని విపక్షాలపై వాడుతున్న తీరు, అదానికి మద్దతుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రియాంక విమర్శలు గుప్పించారు.
రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. దర్యాప్తు సంస్థల్ని విపక్ష నేతలపై కేంద్రం ఉసిగొల్పుతున్న తీరును తప్పుబట్టారు. తప్పుడు కేసులతో విపక్షాల గొంతు నులిమేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అదానీ వ్యవహారంపై స్పందిస్తూ ఒక్కడి మేలు కోసం 142 కోట్ల మంది ప్రజల్ని పణంగా పెడతారా అంటూ ప్రధాని మోడీని నిలదీశారు. దేశంలో కోట్లాది మంది పేద ప్రజల్ని పణంగా పెట్టి అదానీకి దేశ సంపద, ఎయిర్ పోర్టులు, భూమి కట్టబెడుతున్నారని విమర్శించారు.

ఎన్డీయేకు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు తగినన్ని సీట్లు వచ్చుంటే దేశ రాజ్యాంగాన్ని మార్చేసేవారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు. తద్వారా పేద ప్రజల, గిరిజనుల హక్కుల్ని హరించే వారని విమర్శించారు. ఈ దేశంలో రైతులు ఏడుస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదని ప్రియాంక ఆరోపించారు. మన రాజ్యాంగాన్ని "న్యాయం, ఐక్యత, వ్యక్తీకరించే హక్కు యొక్క సురక్ష కవచం"గా ఆమె అభివర్ణించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ సూత్రాలు క్రమపద్ధతిలో క్షీణిస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ సర్వీసుల్లో లేటరల్ ఎంట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యల ద్వారా రిజర్వేషన్ కోటాలను నిర్వీర్యం చేసి, అంతిమంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన సామాజిక న్యాయ సూత్రాలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications