పబ్లిసిటీ ముందు కరోనా వెలవెల.. లాక్ డౌన్లోనూ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రారంభోత్సవాలు..
పబ్లిసిటీ కోసం రాజకీయ నేతలు ఎంతకైనా సిద్ధమైపోతారు. కాలమాన పరిస్ధితులతో కానీ ముహుర్తాలతో కానీ, విపత్తులతో కానీ వారికి సంబంధమే ఉండదన్న విమర్శలు మనం అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్ధితి చూస్తుంటే అదే నిజమనిపించేలా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా ప్రజాప్రతినిధుల పబ్లిసిటీ స్టంట్ లు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కరోనా నిరోధక చర్యల్లో బిజీగా ఉండాల్సిన నేతలు పబ్లిసిటీ కోసం బయటికి రావడంపై జనం మండిపడుతున్నారు.
Recommended Video

కరోనా అయితే మాకేంటి ?
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇళ్లలోనే ఉంటూ జనానికి ఆదర్శంగా ఉండాల్సిన తరుణంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు చివరికి ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ , చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పలుచోట్ల ప్రారంభోత్సవాలు చేస్తూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ కావడంతో వీటిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాను వదిలి పబ్లిసిటీ కోసం..
వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో సహాయక చర్యల్లో వైద్య సిబ్బంది, పోలీసులు బిజీగా ఉంటున్నారు. చేతనైతే వారికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు రోజువారీ ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో కొందరు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకే రిబ్బన్లు కట్టి మరీ ప్రారంభించడం చూస్తుంటే కరోనాపై వీరికి ఉన్న సీరియస్ నెస్ ఏంటో అర్ధమవుతోంది.

ఇప్పటికే కరోనా మాస్కులతో ప్రచారం..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ రంగులతో ముద్రించిన మాస్కులను పంచుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పలుచోట్ల వీటిని ధరించి ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు. దీంతో కరోనా మాస్కుల్లోనూ వైసీపీ ప్రచారం అవసరమా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ తాజాగా ఏకంగా ప్రజాప్రతినిధులే బయటికి వచ్చి ప్రజలకు అవగాహన కల్పించకుండా ప్రారంభోత్సవాలు చేయడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications