తల్లిపాలకు ఏటీఎంలు : పుదుచ్చేరిలో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్
పుదుచ్చేరి : నెలలు నిండకుండానే జన్మించే శిశువుల సంరక్షణార్థమై.. పుదుచ్చేరిలో తల్లిపాల ఏటీఎంలు ఏర్పాటు చేశారు అక్కడి జవర్ హర్ లాల్ పీజీ వైద్య విద్యా, పరిశోధన కేంద్రం వైద్య నిపుణులు. నెలలు నిండకముందే జన్మించే శిశువుల కేసులు ఎక్కువగా నమోదవుతుండడం.. అలా జన్మించిన శిశువులంతా తక్కువ బరువు ఉంటుండడంతో, తల్లిపాల ఏటీఎంలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆముధం థైప్పాల్ మయాం (ఏటీఎం) పేరిట పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా.. నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల పాల అవసరాలను తీర్చనున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణాలేంటంటే.. పుదుచ్చేరి వైద్య కేంద్రంలోని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో సగటున నెలకు 30 శాతం మంది శిశువులు.. అంటే, 1500 మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారు.
ఇలా నెలలు నిండకుండా జన్మిస్తున్న శిశువుల సంఖ్య ఎక్కువవుతుండడంతో.. వారందరికీ తల్లిపాల సంరక్షణ కష్టంగా మారింది. దీంతో ఈ సమస్యను నివారించడానికి తల్లుల బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడి వైద్యులు చెబుతున్నారు. తల్లుల నుంచి సేకరించిన బ్రెస్ట్ మిల్క్ ను ఈ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించనున్నారు.
తల్లిపాలు సరిగా లేని పిల్లలకు, అలాగే సాధారణంగా నెలలు నిండకుండా పుట్టే శిశువులు కూడా తక్కువ బరువు ఉంటారు కాబట్టి.. ఆరు నెలల వరకు వారికి తల్లిపాలు అందించే ఉద్దేశంతో అన్ని శిశు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఈ తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేయబోతున్నట్లు జిప్మర్ సంచాలకులు ఎస్ సీ పరీజా తెలిపారు.