అసలు ఎందుకో: మోడీకి బాబు ఝలక్, జగన్ ఇలాకాలో నీటి కోసం సీఎం వద్దకు..
రూ.2000 నోటును రద్దు చేయాలని, దాంతో అవినీతి పెరుగుతుందని చెప్పడం ద్వారా కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్లయింది.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.2వేల నోటు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రూ.2000 నోటు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారని, రేట్లు పెరిగి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారని, అది తేవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
మోడీ ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, రూ.2000 నోటును తెచ్చిన విషయం తెలిసిందే. పెద్ద నోటు తీసుకు రావడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు, లోకేష్ సహా టిడిపి నేతలు రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలంటున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరు బ్లాక్ మనీ పోవాలని అంటున్నారని, రూ.2వేల నోట్లు పెడితే ఎలా పోతుందని ప్రశ్నించారు. దీని వల్ల బ్లాక్ మనీ మరింత పెరుగుతుందన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా మోడీని ఉద్దేశించే అంటున్నారు.
'నిన్నటిదాకా అలా, ఇప్పుడు వైయస్ జగన్కు నరేంద్ర మోడీ భయం'
చంద్రబాబుతో పులివెందుల చినీ రైతులు భేటీ
పులివెందుల చినీ రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి రైతులు చంద్రబాబును కలిశారు. తమ చినీ తోటలకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులతో మాట్లాడారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదే అన్నారు. గాలేరు - నగరిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టులను నింపే బాధ్యత తనదే అన్నారు. సీమ ప్రాజెక్టులు పూర్తయితే రూ.400 టీఎంసీల నీటిని ఒడిసి పెట్టవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.35వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. కృష్ణా - పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామన్నారు.