పురంధేశ్వరి, కిల్లి రాజీనామా: టిపై సుప్రీంకు లగడపాటి!
వీరిద్దరి రాజీనామాలతో కేంద్రమంత్రుల రాజీనామాలు ఆరుకు చేరుకుంది. ఇప్పటికే చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కిల్లి, పురంధేశ్వరిలు రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలు ఆమోదిస్తారా లేదా అనేది చూడాలి.
కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, కిషోర్ చంద్రదేవ్ తదితరులు అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పినందున వారు రాజీనామా చేసే అవకాశం లేదు. ఎంపి కనుమూరి బాపిరాజు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొందరు సీమాంధ్ర నేతలు రాజీనామాలపై తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఏరాసు గవర్నర్ను కలిసి రాజీనామాపత్రాన్ని సమర్పించారు. కర్నూలు శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఇక ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని, తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడించాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మండలి బుద్ద ప్రసాద్ కాంగ్రెసు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి సహా పలు జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ జెండాలను తగులబెట్టారు.
సుప్రీంకు లగడపాటి
విభజన నిర్ణయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సుప్రీం కోర్టులో తేల్చుకోనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేయనున్నారట.