వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఎన్టీఆర్ తలదించారు, వైయస్ పిలుపు.. బాబు పాలనపై అసంతృప్తి’

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై ఆసక్తికర సమాధానాలిచ్చారు.
రాజధాని నిర్మాణానికి భూసేకరణ.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.

పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చులను వివరంగా చూపకపోవడం, రైతుల పునరావాసంపై స్పష్టత లేకపోవడం, ఏ విషయంలోనూ చర్చకు తావీయక పోవడం.. వంటి అన్ని అంశాలనూ బిజెపి అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆమె అన్నారు. రైతుల, డ్వాక్రా రుణమాఫీలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రబలంగా ఉందన్నారు.

కేంద్రం సహకరించడం లేదనే వాదన అర్థరహితమని, రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి తీవ్రంగానే ఉందని, భవిష్యత్తు పరిణామాలను బట్టే టీడీపీతో పొత్తుపై ఆలోచించుకుంటామని అన్నారు. హెదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ పునరావృతమౌతోందా? అనే అనుమానం చాలామందిలో ఉందని అన్నారు.

తన తండ్రి ఎన్టీఆర్ ప్రభావంపై పురంధేశ్వరి మాట్లాడుతూ.. 'మన సంస్కృతి, పద్ధతులను తప్పకుండా పాటించాలని చెప్పేవారు. కఠినంగా కాదు కానీ కచ్చితంగా ఉండేవారు. అలాగే ఇంట్లో తనకు నచ్చని పనులు మేం చేసినట్లయితే ఎంతో విలక్షణంగా మాపై కోప్పడేవారు. ఎప్పుడూ మాపై చెయ్యి చేసుకునేవారు కాదు. కాకపోతే 'ఏం, మనకు మతులు పోతున్నాయి' అనే డైలాగ్ వదిలేవారు. మమ్మల్నే కాదు, ఆయన్ను కూడా కలుపుకుని ఆ మాట అనేవారు. మమ్మల్ని తిట్టి, చెయ్యి చేసుకుని ఉంటే, ఆ మాట ప్రభావం మామీద ఉండేది కాదు' అని తెలిపారు.

వైయస్ ఆహ్వానించారు

వైయస్ ఆహ్వానించారు

‘మొదట కాంగ్రెస్ పార్టీలోకి నా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చారు. అప్పట్లో బాపట్ల ఎంపీ స్థానంలో ఉన్న రామానాయుడికి దగ్గుపాటి గట్టిపోటీ ఇవ్వగలరనే ఉద్దేశంతో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా రమ్మని వైయస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఉండటమే తనకిష్టమని, మంచి అభ్యర్థి ఎవరూ కాంగ్రెస్‌కు దొరకరని భావిస్తే అప్పుడు పురందేశ్వరి పేరు పరిశీలించాల్సిందిగా దగ్గుబాటి సూచించారు. ఇవేవీ నాకు తెలియవు. అభ్యర్థిగా పురందేశ్వరి ఉంటారని మరుసటి రోజు పేపర్లో ఒక లీక్ ఇచ్చారు. తర్వాత పిల్లలతో చర్చించి, బాధ్యతగా ఉంటామని వారు హామీ ఇచ్చిన తర్వాతే నేను పోటీ చేశాను' అని పురంధేశ్వరి తన రాజకీయ ప్రవేశంపై వివరించారు.

ఎన్టీఆర్ కళ్లల్లో నీళ్లు

ఎన్టీఆర్ కళ్లల్లో నీళ్లు

తెలుగుదేశం వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది కదా అని మీరు బాధపడ్డారా? అని ప్రశ్నించగా.. ‘నాన్న జీవించి ఉన్నప్పుడు కోరుకుని మరీ సింహం గుర్తు తెచ్చు కున్నారు. నా మనస్సులో అదే మిగిలిపోయింది. మరోవైపున నాన్నను అవమానించి పార్టీ నుంచి బహిష్కరించడం, చివరకు అసెంబ్లీలో ఒక్కసారైనా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ఇవ్వకపోవడం జరిగింది. రోశయ్యగారు కూడా పలు సందర్భాల్లో నాతో చెప్పారు. 'నాన్న కన్నీళ్లతో తలదించుకుని అసెంబ్లీ నుంచి బయ టకు వెళుతుంటే ఆనాడు ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాకు కూడా కడుపు తరుక్కు పోయిందమ్మా' అని అన్నా రాయన. నాన్నకు అలాంటి పరిస్థితి వస్తుందని మేమెన్నడూ ఊహించలేదు' అని చెప్పారు.‘మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేకపోయారు. నష్టాన్ని భర్తీ చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోయారు. హోదా కోసం నినదించినా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో పెట్టలేకపోయారు. అందుకే పార్టీ మారాల్సి వచ్చింది' అని తెలిపారు.

బిజెపి.. చంద్రబాబు రక్తం మరిగిపోయేలా చేసిందా? అని ప్రశ్నించగా.. ‘ప్రత్యేక హోదాకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం రూపంలో ఒక సాంకేతిక సమస్య ఉంది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా 2017 మార్చి తర్వాత అది ఉండదని ఏపీ సీఎం స్వయంగా చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పింది కూడా ఆయనే కదా. అప్పుడు రక్తం మరగ లేదా? ఇంకోసారేమో అది జీవన్మరణ సమస్య అన్నారు. ఇదంతా వారికి తెలియని విషయమా? ' అని ప్రశ్నించారు.

పోలవరం

పోలవరం

‘పోలవరంపై కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు అనడం సరికాదు.
పోలవరం విషయంలో ఒక వివరణ ఇవ్వాలి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, బిల్లులో పెట్టిన తర్వాత దాని నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇవ్వాళ కేంద్రప్రభుత్వం ఎక్కడా వెనుకాడలేదు. రూ. 2,334 కోట్లకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గుత్తంగా జలవనరుల శాఖకు పంపించింది. కానీ పంపించిన బిల్లులో అనుమానాలు ఉన్నాయి' అని అన్నారు.

‘పట్టిసీమ పోలవరం అంతర్భాగమని చెప్పి బిల్లులో పెట్టారు. కానీ పోలవరం డిజైన్ ను ప్రభుత్వం ఆమోదించుకున్నప్పుడు పట్టిసీమ దాంట్లో అంతర్భాగం కాదు. అలాగే పునరావాసం, భూసేకరణ వంటివాటిపై కేంద్రం వివరణ అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్పిస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని విశ్వా సంలోకి తీసుకోవాలి అని బిల్లులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాన్ఫి డెన్‌సలోకి తీసుకోకుండా ఎలా చేశారు? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి.
దాన్నే కేంద్ర ప్రభుత్వం అడుగుతోంది' అని వివరించారు.

‘రూ. 955 కోట్లు పట్టి సీమకు పెట్టాము. రూ. 184 కోట్లు పునరావాసం కోసం పెట్టామన్నట్లుగా కాదు. ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పోలవరం ప్రాజెక్టును చేయాలన్న పట్టుదల కేంద్రానికి ఉంది. ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదంటూ అసత్యం మాట్లాడకూడ దని నా అభిప్రాయం. మీరు ఏం అడిగారు, ఎక్కడ మీకు సహకరించడం లేదు అనే అంశంపై శ్వేతపత్రం ప్రకటించండి' అని చంద్రబాబు సర్కారుకు సవాల్ విసిరారు.

రాజధాని

రాజధాని

‘రాజధానిపై డీపీఆర్‌ను ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వానికి పంపించారా నాకు తెలీదు. డీపీఆర్ ఇచ్చారా? మాస్టర్ ప్లాన్ అయిపోయిందా? మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళ్లినా, అసలు నీకు స్థలం ఉందా, నీ ప్లాన్ ఏమిటి? అని అడుగుతారు. కేంద్రానిదీ ఇదే పరిస్థితి కదా. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2,050 కోట్లు ఇచ్చింది. వెయ్యి కోట్లు గుంటూరు, విజయవాడ డ్రెయినేజ్ అభివృద్ధికి ఇవ్వగా. మిగిలిన వెయ్యి కోట్లూ సెక్రటేరియట్ వంటి నిర్మాణాలు చెయ్యమనే కదా మీకు ఇచ్చారు. డీపీఆర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కేంద్రం ఈ మొత్తాన్ని ఇచ్చింది' అని వివరించారు.

చంద్రబాబు ప్రభుత్వం

చంద్రబాబు ప్రభుత్వం

‘అభివృద్ధి మొత్తం ఒకేచోట ఉండకూడదు. వికేంద్రీకరణ జరగాలి అని మా భావన. కానీ ఇవ్వాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ పునరా వృతమౌతోందా అనే అనుమానం చాలా మందిలో రాకపోలేదు. అలాంటి అలో చన ఒకటైతే ఉంది.
సింగపూర్ కంపెనీ అని, స్విచ్ చాలెంజ్ అని, అవినీతి ఆరోప ణలు అని విపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై గురుతరమైన బాధ్యత ఉంటుంది. మీరు ప్రజలకు వివరించి చెప్పాలి. కానీ ఇప్పటివరకు వివరణ రాలేదు. రాజధానికోసం లేదా మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీ కోసం తీసుకునే భూములు కావచ్చు.. అంత పెద్ద మొత్తంలో భూమిని తీసుకుంటు న్నప్పుడు పారదర్శకంగా ఉండాలని చెబుతున్నాం. దీనిపై అంతర్గతంగా కూడా చర్చ చేస్తున్నాం' అని వివరించారు.

ఏపీ సర్కారులో అవినీతి

ఏపీ సర్కారులో అవినీతి

‘అవినీతి బాగా ఉందని మాకు సమాచారం అందుతున్న మాట వాస్తవం. భూమి విషయంలో చాలా అనుమానాలున్నాయి. పారదర్శకంగా ముందుకు రావల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తప్పకుండా దీన్ని మేము మా నాయకత్వం ముందుకు తీసుకెళతాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మేము చర్చించి, పైవారి దృష్టికి కూడా తీసుకెళ్లడమైంది' అని పురంధేశ్వరి తెలిపారు.

పార్టీ ఫిరాయింపులు ఎవరూ చేసిన అది సమర్థనీయం కాదని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందో? లేదో ఇప్పుడే చెప్పలేమని, అన్నారు. ప్రజల్లో టిడిపి సర్కారుపై వ్యతిరేక పెరిగిందని చాలా మంది తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 2014లోనే ఒంటిరిగా పోటీ చేసివుంటే బిజెపి బలం మరింత పెరిగివుండేది, అయితే, వచ్చే ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పురంధేశ్వరి వివరించారు.

English summary
BJP leader Purandeswari responded on andhra Pradesh politics and Government policies and state issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X