రాష్ట్రంలో పూటగడవని పరిస్థితి -కొత్త నాయకత్వం అవసరం : పురంధేశ్వరి సంచలనం..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం తన పాలనలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉందని అన్నారు. .ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భాజపా సత్తా ఎంటో మరోసారి రుజువైందని పురందేశ్వరి అన్నారు. భాజపాపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసాన్ని చూపారన్నారు. ఈ గెలుపు కోసం కృషి చేసిన భాజపా దేశ నాయకత్వానికి ఆమె అభినందనలు తెలిపారు.
'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' నినాదంతో భాజపా ముందుకు వెళ్తోందని పురందేశ్వరి అన్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. చివరికి పాకిస్థాన్ విద్యార్థులు కూడా భారత్ జెండా చేతబూని వారి స్వస్థలాలకు చేరుకున్నారంటే..అది ప్రధాని మోదీ పరిపాలనదక్షతకు నిదర్శనమని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అప్పు దొరుకుతుందా అనే వెతుకులాటలో ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇస్తే గానీ రాష్ట్రంలో పూటగడవని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో పాలకులు స్వలాభం కోసం పాలన సాగిస్తున్నారే తప్ప.. సుపరిపాలన కాదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం లేదని కేంద్రం పై దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేసిందని అన్నారు. రాష్ట్రంలోని భూములను తాకట్టుపెడుతోందని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి ఒక కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అయిదు రాష్ట్రాల విజయంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. అవే ఫలితాలు ఏపీలోనూ పునరావృతం కానున్నాయంటూ చెప్పుకొచ్చారు. అందు కోసం కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పని చేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications