టిడిపితో విభేదాల్లేవు, మీ సాయం కావాలి!: బాబుకు పురంధేశ్వరి
ఒంగోలు/విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, అలా అయితే నిర్ణీత గడువులో పోలవరం పూర్తి కాదని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం నాడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేంద్రం సూచించిన వాటికే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు. పోలవరం పూర్తయితే ఏపీ ప్రజలకు తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు.
వరద నీటిని ఒడిసిపట్టే పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎంతో లాభమన్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్రం సహాయం చేయాలన్నారు. రాష్ట్ర సహకారం లేకుండా పోలవరం పూర్తి కాదన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని నియమిస్తున్నారా అని మీడియా ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ.. బిజెపి తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధికి పని చేస్తానన్నారు. పార్టీ తనకు అప్పగించిన మహిళా మోర్చా ఇంఛార్జి బాధ్యతలను ప్రస్తుతం నిర్వహిస్తున్నానని చెప్పారు.
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరలింపు, నిమ్స్కు నిధుల మళ్లింపు వంటి అంశాలపై విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని, వాటిపై తాను వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.