'ఎన్టీఆర్ కన్నీళ్లు', హరికృష్ణ, బాలకృష్ణలు ఎందుకలా!, ఎర్రనాయుడు ఏంచెప్పాడు?
హైదరాబాద్ : సాక్షి ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబు ఆయన్ను ఎంత మానసిక క్షోభకు గురిచేశారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందుకు సంబంధించిన పలు సందర్బాలను పురంధేశ్వరి వివరించారు.
ఎన్టీఆర్ ను గద్దె దించడానికి చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాల్లో భాగస్వామి కావద్దని తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తాను సూచించానని.. అయితే, ఆయన నిర్ణయానికి అడ్డు చెప్పేంత శక్తి అప్పుడు తనకు లేకపోయిందని పురంధేశ్వరి విచారం వ్యక్తం చేశారు. ఆలోచించుకోవడానికి అప్పుడు అంతగా సమయం చిక్కలేదని.. ఆ తర్వాత పరిణామాలు దగ్గుబాటిని రియలైజ్ అయ్యేలా చేశాయని చెప్పుకొచ్చారు.
ఇక ఆ సమయంలో.. హరికృష్ణ, బాలకృష్ణలు చంద్రబాబుకు ఎందుకు అడ్డుగా నిలబడ్డారనే విషయంపై తనకు అంతగా స్పష్టత లేదన్నారు. అయితే, మంత్రి పదవుల విషయంలో వారి మధ్య అంతర్గతంగా చర్చలు జరిగాయనే విషయం మాత్రం తన దృష్టికి వచ్చిందన్నారు పురంధేశ్వరి.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్న తర్వాత.. చంద్రబాబును ఎదిరించి నిలబడేందుకు ఆయన చాలానే ప్రయత్నాలు చేశారని, కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే ఎన్టీఆర్ కన్నుమూశారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును ఎదిరించి నిలిచేందుకు.. సింహం గుర్తును కూడా ఎన్టీఆర్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
పార్టీని లాగేసుకున్న తర్వాత.. కనీసం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఎన్టీఆర్ కు ఇవ్వకుండా ఆయన్ను తీవ్రంగా అవమానించారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చివరి రోజుల్లో వాటి ప్రభావం ఎన్టీఆర్ పై ప్రభావం చూపించిందని, అనుకోని పరిణామాలకు ఆయన ఎక్కువ కాలం జీవించలేదని చెప్పారు.
అసెంబ్లీ నుంచి బయటకొస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకుంటూ బయటకు రావడం, ప్రతిపక్షంలో ఉన్న తమను సైతం చలించిపోయేలా చేసిందని రోశయ్య తన వద్ద విచారం వ్యక్తం చేసినట్లు పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
ఆ విషయం ఎర్రనాయుడే చెప్పాడు :
ఎన్టీఆర్ కన్నుమూసిన తర్వాత పార్టీలో ఆయన తాలుకు ప్రస్తావనే లేకుండా చేసేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయని పురంధేశ్వరి చెప్పారు. అదే క్రమంలో.. కనీసం ఆయన ముఖచిత్రాన్ని కూడా టీడీపీలో ఎక్కడా కనిపించకుండా చేసే ప్రయత్నం జరిగిందన్నారు.
అందుకే.. పార్టీ సభ్యత్వం పుస్తకాల్లో సైతం ఎన్టీఆర్ బొమ్మను ముద్రించకుండా చేసేశారని, ఈ విషయాన్ని ఎర్రనాయుడే స్వయంగా వెల్లడించారని పురంధేశ్వరి తెలిపారు. అయితే టీడీపీలో ఎన్టీఆర్ బొమ్మ కూడా లేకుండా పోవడాన్ని ప్రజలు సహించలేకనే పార్టీని తిరస్కరిస్తూ వచ్చారని పరుంధేశ్వరి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications