పాపం పద్మా!, ఏపీలో ఎంత కష్టమొచ్చిందో?, ఏడుస్తూ 'కేసీఆరే బెటర్' అని..
తన బాధనంతా ఫేస్బుక్ లో వెళ్లగక్కినా.. ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. ఎవడూ ఇటువైపు రాడేంట్రా బాబు? అంటూ పద్మా చౌదరి తెగ విసుక్కున్నారు.
విజయవాడ: ఏదైనా సరే.. చెంతన ఉన్నన్నాళ్లు దాని విలువ తెలియదు. తీరా అది దూరమై.. తిరిగి చేరుకోలేనంత దూరంలో మన కాళ్లు చిక్కుకుపోయాక.. అరిచి గీ పెట్టిన లాభం ఉండదు. పాపం.. ఏపీ సచివాలయంలో అత్యంత విధేయత కలిగిన ఉద్యోగినిగా పేరు తెచ్చుకున్న పుష్పావతి పుత్రికా పద్మాచౌదరికి ఇప్పుడు ఇలాంటి కష్టాలే మొదలయ్యాయి.
హయ్యో.. హైదరాబాద్ను అనవసరంగా వదిలిపెట్టేసి వచ్చామే.. అంటూ బేల మొహం వేసుకున్న ఫోటో ఒకటి ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసి పద్మా చౌదరి తన గోడు వెల్లబోసుకుంది. ఇంతకీ పద్మాచౌదరి బాధేంటి?.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీ సచివాలయంలో ఉద్యోగం.. మూన్నాళ్ల ముచ్చటలా.. కొన్నిరోజులు బాగానే ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్ది.. వ్యవహారం బెడిసికొడుతుందని పద్మా చౌదరి గారు సోషల్ మీడియాలో వాపోతున్నారట.
ఎవరో ఎమ్మెల్యే ఉద్యోగులందరిని వెధవ అన్నాడని.. ఫేస్ బుక్ లో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారట పద్మా చౌదరి. అదొక్కటేనా?.. అసలు ఈ ఆంధ్రావాళ్లంతా అంతా ఇంతే! అంటూ సోషల్ మీడియాలో ఒక తీర్మానం కూడా ఇచ్చేశారు. అక్కా.. అంటూ అర్థరాత్రి ఆన్ లైన్ చాటింగులేంట్రా వెధవల్లారా? అంటూ కాస్త ఘాటుగానే నాలుక మడతెట్టారు.
అవసరానికి వాడుకోవడం తెలుసు కానీ ఏదైనా ఆపద వస్తే మాత్రం ఎవరు మనవైపు చూడరంటూ గట్టిగానే చురకలంటించారు. అంతేనా!.. హాయిగా హైదరాబాద్ లోనో, ఖమ్మంలోనో ఉద్యోగం చేసుకుంటే ఈ బాధలన్ని ఉండకపోయేవి కదా? అంటూ కొన్ని నిట్టూర్పులు కూడా విడిచారు. ఇక్కడికొచ్చి గంజికి కూడా దిక్కులేనిదానిలా ఈ పరిస్థితేంటి? అని కుమిలిపోయారు.
చివరాఖరి కొసమెరుపు ఏంటంటే.. తన బాధనంతా ఫేస్బుక్ లో వెళ్లగక్కినా.. ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. ఎవడూ ఇటువైపు రాడేంట్రా బాబు? అంటూ పద్మా చౌదరి తెగ విసుక్కున్నారు. మీ కంటే మా కేసీఆర్ సారే లచ్చ రెట్లు బెటర్ అని ఖరాఖండిగా చెప్పేసి ముగించారు.
ఇక్కడికి పద్మా చౌదరి గారు ముగించడం బాగానే ఉంది గానీ.. మొత్తం ఆంధ్రావాళ్లందరిని ఒకే గాటన గట్టి విమర్శించడంపై ఏపీ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ఇప్పటికైనా తెలంగాణ గొప్పతనమా? అర్థమైందా అంటూ ఇటు తెలంగాణ జనం వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఇదన్న మాట సంగతి.