టీటీడీ రేసు కాస్త టీడీపీ నేతల మధ్య పోటీగా మారింది..!
మురళీమోహన్.. రాయపాటి సాంబశివరావు.. గోకరాజు గంగరాజు.. చంద్రబాబు ఎవరిని కరుణిస్తారో తెలియదు గానీ ఈ ముగ్గురు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. ఇదంతా టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పదవి కోసం నేతలు పడుతున్న హైరానా. వచ్చే మే నెలతో ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ముగుస్తుండడంతో ఎలాగైనా టీటీడీ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు నేతలు.
ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సీఎం చంద్రబాబును కలిసి టీటీడీ ఛైర్మన్ పదవి తనకే దక్కేలా చూడాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా టీటీడీ ఛైర్మన్ పదవిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. చంద్రబాబుకి ఇప్పటికే విషయాన్ని చేరవేసిన రాయపాటి పదవి తనకే దక్కేలా చేయాలని పట్టుబడుతున్నట్టుగా సమాచారం. దీంతో టీటీడీ పదవి కాస్త టీడీపీ నేతల పోటీగా మారిపోయింది.

నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకోసం ఆయన బీజేపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం ఛైర్మన్ పదవిని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టరాదు. ఈ ముగ్గురు ఎంపీలు పారిశ్రామికవేత్తలే కావడంతో వీళ్ల కోసం నిబంధనల్ని తుంగలో తొక్కుతారా..! లేక.. ఇప్పుడున్న పాలకమండలినే ఇంకో ఏడాదిపాటు కొనసాగిస్తారా..! అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ గా తిరుపతికి చెందిన చదలవాడ క్రిష్ఱమూర్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. 18 మంది సభ్యులతో కూడిన పాలకమండలి గతేడాది మే 1న బాధ్యతలు స్వీకరించింది. ఇందులో తెలంగాణ నుండి హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్మే సాయన్న కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఆయన స్థానంలో మరొకరిని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications