వదల బొమ్మాళీ వదల : సీఎంకు రఘురామ మరో లేఖ: ఢిల్లీలో జగన్ సైలెంట్ ఆపరేషన్..!!
ఢిల్లీ కేంద్రంగా రఘురామ రాజు టార్గెట్ జగన్ అన్నట్లుగా వెంటాడుతున్నారు. జగన్ ప్రభుత్వ తీరు పైన వరుసగా కేంద్ర మంత్రులు..ముఖ్యమంత్రులు..గవర్నర్లు..ఎంపీలకు లేఖలు రాసిన రఘురామ రాజు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్ కే లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే రఘురామ రాజు లేఖలు సంధిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ ప్రతీ ఏటా రూ 250 చొప్పున పెంచుతూ పోతామని చెప్పారని...ఆ లెక్క ప్రకారం జూన్ 1వ తేదీకి పెన్షన్ ను రూ 2750 అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఇక, ఇప్పుడు తాజాగా మరో లేఖ విడుదల చేసారు.
రఘురామ లేఖలో తాజా డిమాండ్..
ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు హామీని నిలబెట్టుకోవాలంటూ లేఖ రాసారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని ఆ లేఖలో గుర్తు చేసారు. దీంతోనే ఆ ఉద్యోగుల నుండి మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు. ఏడు రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారని..ఇప్పటికి 765 రోజులు అయినా హామీ అమలు కాలేదన్నారు. సీఎం జగన్ ఈ హామీని వెంటనే అమలు చేయాలని రఘురామ రాజు లేఖలో కోరారు. రఘురామ రాజు ఎవరికి ఫిర్యాదులు చేసినా..లేఖలు రాసినా వైసీపీ నుండి మాత్రం స్పందన కనిపించటం లేదు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ అధికారిక అజెండా తో పాటుగా రాజకీయ అజెండాలో రఘురామ అంశం సైతం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సుదీర్ఘంగా సమావేశం జరిగిన సమయంలో రఘురామ రాజు అంశం పైన చర్చకు వచ్చిందని పార్టీలో చర్చ సాగుతోంది. జగన్ ఢిల్లీ రావటంతో పార్టీ ఎంపీలు సైతం హస్తిన చేరుకున్నారు.
సీఎం సైలెంట్ ఆపరేషన్
అయితే, రఘురామ రాజు విషయంలో ముఖ్యమంత్రి రాజకీయంగా ఏం చేస్తున్నారనేది బయటకు రాకుండా సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటీషన్ ఇచ్చారు. అయితే, దీని పైన ఇప్పటి వరకు చర్యలు లేకపోవటంతో వైసీపీ నేతలు మరిన్ని ఆధారాలు స్పీకర్ కు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత స్పీకర్ ను కలిసేందకు వైసీపీ నేతలు అప్పాయింట్ మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఆ సమయంలో రఘురామ రాజు పార్టీ అధినేత..ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను వివరించటంతో పాటుగా... ఆయన పైన చర్యలు తీసుకోవాలని మరో సారి గట్టిగా కోరేందుకు సిద్దమవుతున్నారని ఢిల్లీ సర్కిల్స్ లో సాగుతున్న ప్రచారం. రఘురామ రాజు ఢిల్లీ కేంద్రం తమను పొలిటికల్ గా డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నా.. తాము వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు
కానీ, ఢిల్లీలో మాత్రం తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వచ్చే వారం రఘురామ రాజు అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని వైసీపీ నేతల అంచనా. ఇదే సమయంలో ఢిల్లీలోనే ఉన్న రఘురామ రాజు తను నమ్ముకున్న దారిలోనే ముందుకు పోతున్నారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా..తనకు ఎక్కడా నష్టం జరగదనే ధీమాతో రఘురామ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..వరుసగా లేఖలు..మరో వైపు ఫిర్యాదులు..కోర్టులో కొనసాగుతన్న కేసులతో ఏపీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ తో అధికారికంగా కేంద్రం నుండి రాష్ట్రం కు ఏ రకమైన ప్రయోజనాలు రాబోతున్నాయనే చర్చ కంటే...పొలిటికల్ గా సీఎం ఢిల్లీలో ఏ రకంగా పావులు కదుపుతున్నారు... రానున్న రోజుల్లో ఏం జరగబోతుందనే చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.