చంద్రబాబుపై సాయిరెడ్డి పోస్టులు - పదవుల నుంచి తప్పించండి: రఘురామ లేఖ..!!
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ లేఖ రాసారు. రాజ్యసభ ఛైర్మన్ కు రాసిన లేఖలో సాయిరెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా పలు కమిటీల్లో ఉన్న పదవుల నుంచి తప్పించాలని ఈ లేఖలో కోరారు. రాజకీయ ప్రత్యర్ధి పార్టీలకు వ్యతిరేకంగా నీచమైన భాషతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సాయిరెడ్డిని స్థాయీ సంఘం ఛైర్మన్, ఎథిక్స్ కమిటీ, ప్యానల్ ఛైర్మన్ పదవుల నుంచి తప్పించాలని రాజ్యసభ ఛైర్మన్ ను కోరారు.

సాయిరెడ్డిని తప్పించండి
విజయ సాయిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో దిగజారిన బాషను ఉపయోగిస్తూ పెద్దల సభ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తున్నారని లేఖలో వివరించారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఆయన కుమారుడు లోకేశ్ పై అనుచిత బాషను ఉపయోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సాయిరెడ్డి ప్రవర్తన పెద్దల సభ గౌరవానికి తగినట్లు లేదన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడటంలో ఛైర్మన్ పాత్ర కీలకమని లేఖలో స్పష్టం చేసారు. సాయిరెడ్డి వినియోగిస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఆశ్యర్చగొలిపే అంశాలు.. అసహ్యకరమైన పోస్టులు కనిపిస్తాయన్నారు.

సాయిరెడ్డి వర్సస్ రఘురామ
తక్షణం స్పందించి సాయిరెడ్డిని స్థాయి సంఘం ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని రఘురామ తన లేఖలో రాజ్యసభ ఛైర్మన్ ను కోరారు. చాలా కాలంగా విజయ సాయిరెడ్డి ..రఘురామ రాజు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. రఘురామ రాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన పైన అనర్హత వేటు కోసం విజయ సాయిరెడ్డి స్పీకర్ కు లేఖ ఇచ్చారు. రఘురామ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు స్పీకర్ ను కలిసారు. ఇక, సామాజిక మాధ్యమాల వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగింది.

చంద్రబాబు పై పోస్టింగ్ ల ప్రస్తావన
పలు సందర్భాల్లో ఇద్దరూ పోటా పోటీగా పోస్టింగ్ లు పెట్టారు. ఇక, తన పైన సీఐడీ కేసు తరువాత రఘురామ వైసీపీ ప్రభుత్వం పైన తన విమర్శల దాడిని తీవ్రతరం చేసారు. ఢిల్లీ వేదికగానే టార్గెట్ చేస్తున్నారు. రఘురామ పైన అనర్హత వేటు వేయాలని సాయిరెడ్డి డిమాండ్ చేస్తుంటే, ఇటు సాయిరెడ్డిని ఆ పదవుల నుంచి తప్పించాలని రఘురామ కోరుతున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేశ్ పైన పోస్టింగ్ లను ప్రస్తావిస్తూ చర్యలు తీసుకోవాలని కోరటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications