కృష్ణంరాజుకు హ్యాండ్, బిజెపిపై చంద్రబాబు అసహనం!
నర్సాపురం టిక్కెట్ కోసం ప్రముఖ నటుడు కృష్ణం రాజుతో పాటు పలువురు రేసులో ఉన్నప్పటికీ రఘురామను వరిస్తుందని అందరు భావించారు. కానీ చివరి నిమిషంలో టిక్కెట్ను గోకరాజుకు ఇచ్చింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహంతో ఉన్నారట.
రఘురామ కృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బిజెపిలో చేరారు. విభజన నేపథ్యంలో బిజెపి నుండి తెలుగుదేశం పార్టీలో కూడా చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన బిజెపిలోనే ఉండిపోయారు. ఇప్పుడు తనకు నర్సాపురం టిక్కెట్ ఇవ్వనందున ఆయన ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈరోజు (బుధవారం) రఘురామ కృష్ణం రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. పలు సీట్ల విషయంలో బిజెపి పట్టుబట్టడం, మొదటి నుండి అనుకున్న వారికి ఇవ్వక పోవడం బాబును అసహనానికి గురి చేస్తోందట.
కాగా, బిజెపి సీమాంధ్ర బిజెపి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు లోకసభ 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటించింది. విశాఖ లోకసభ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు, తిరుపతి లోకసభ అభ్యర్థిగా కారుమంచి జయరాం, నరసాపురం లోకసభ అభ్యర్థిగా గోకరాజ గంగరాజులను ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్థుల జాబితా... తాడేపల్లిగూడెం - మాణిక్యాలరావు, కడప - టి హరినాథ రావు, ఇచ్చాపురం - ఒడిశి బాలకృష్ణ, పాడేరు - లోకుల గాంధీ, విశాఖ (తూర్పు) - విష్ణు కుమార్ రాజు, కోడుమూరు - కె రమేష్, విజయవాడ (పశ్చిమ) - వి శ్రీనివాస రావు, కైకలూరు - కె శ్రీనివాస రావు, నెల్లూరు- సురేష్ రెడ్డి, రాజమండ్రి (అర్బన్) - ఆకుల సత్యనారాయణ, నర్సరావుపేట - రఘునాథ బాబు, మదనపల్లె - నర్సింహారెడ్డి, సంతనూతలపాడు- ధారా సాంబయ్య.