జగన్ కౌంటర్కు రఘురామ రీకౌంటర్- కేసులు దాచిపెట్టారనడంపై-దోషిని కాదంటూ
ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహారంలో సీఐడీ కేసు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో బెయిల్ పొందాక తొలిసారి మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు చెబుతూనే జగన్ బెయిల్ రద్దు కేసులో తాజా పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా జగన్ ఇవాళ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులపై నమ్మకం ఉందని, దేవుడున్నాంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.
Recommended Video
రఘురామ తాజా వీడియో
ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందిన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొదంటూ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన బెయిల్ తర్వాత తొలిసారిగా వీడియో విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా తనకు అండగా ఉంటున్న వారితో పాటు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంపైనా మాట్లాడారు. దీంతో రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
వారికి కృతజ్ఞతలు చెప్పిన రఘురామ
15, 16 రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతున్నానంటూ వీడియో మొదలుపెట్టిన రఘురామ... తాను బెయిల్పై వచ్చిన తర్వాత ఎంతమంది పెద్దవారు నా వయసు వారు, చిన్నవారు, కాలేజి విద్యార్ధులు చూపించిన అవాజ్యమైన ప్రేమ, అనురాగం, వారు రాసిన రామకోటి, శివకోటి, సాయికోటి, నేను త్వరగా విడుదల కావాలని కోరుకున్న వారి వల్లే నేను మీ ముందుకు రాగలిగాను అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నా ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసినా తక్కువేనన్నారు. ప్రత్యక్షంగా మిమ్మల్ని వచ్చి కలిసి కృతజ్ఝతలు తెలిపినట్లు భావించాలని కోరారు.
సీఐడీ కేసులో ఏం జరిగిందో అందరికీ తెలుసు
సుప్రీంకోర్టు బెయిల్ షరతులకు లోబడి ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి తాను మాట్లాడబోనని రఘురామ తెలిపారు. ఆ కేసు గురించి తాను మాట్లాడకూడదని, మాట్లాడబోనని చెప్పారు. ఆ కేసులో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. బెయిల్ ఇచ్చిన సందర్భంగా ఈ కేసుపై బహిరంగ వాఖ్యలు చేయొద్దని, మీడియాకు ఇంటర్వ్లూలు ఇవ్వొద్దని, సాక్ష్యుల్ని ప్రభావితం చేయరాదని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది.
జగన్ కౌంటర్పై రఘురామ రియాక్షన్
జగన్ బెయిల్ రద్దుపై విచారణ మూడుసార్లు వాయిదా పడ్డాక ఆయన కౌంటర్ దాఖలు చేశారని, నాపై ఏడు ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తి ఈ పిటిషన్ ఫైల్ చేయడం ఎలా అని ప్రశ్నించారని రఘురామ తెలిపారు. ఓ వేలు చూపిస్తే నాలుగు వేళ్లు ఆయనవైపు చూపించినట్లుందని రఘురామ ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో మా రీజాయిండర్ కూడా వేశాక విచారణ జరుగుతుందన్నారు. న్యాయస్ధానాలపై నమ్మకం ఉందని, భగవంతుడిపై విశ్వాసం ఉందని రఘురామ తెలిపారు. ప్రజల దయతో, స్వామి అండదండలతో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. నా పోరాటం ప్రజల కోసం, మీ కోసం, ఇందులో నా వ్యక్తిగత స్వార్ధం లేదని తెలిపారు. జరుగుతున్న అన్యాయాన్నిప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమే గతంలోనూ చేశానన్నారు. పర్యవసానం ఎలా ఉన్నా నేను మీతోనే ఉంటానని హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మనమంతా కలిసి పాటుపడదాం అని పిలుపనిచ్చారు.
ఎఫ్ఐఆర్ వేయగానే దోషిని కాదన్న రఘురామ
తనపై కేసులు దాచిపెట్టి తన బెయిల్ రద్దుకు పిటిషన్ వేశారంటూ ఇవాళ సీబీఐ కోర్టులో రఘురామను ఉద్దేశించి జగన్ కౌంటర్లో ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. తన నియోజకవర్గంలో దాఖలైన ఏడు ఎఫ్ఐఆర్లలో తాను దోషిగా నిరూపణ కాలేదని, ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఛార్జిషీట్ కూడా దాఖలు కాలేదన్నారు. దోషిగా నిర్ధారణ కాకముందే ఎఫ్ఐఆర్ వేసినంత మాత్రాన నేరస్తుడిని కాదన్నారు. తనపై కేసులేవీ ఇంకా నిరూపణ కాలేదన్నారు.