ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..
సొంత పార్టీపైనే ధిక్కార పతాక ఎగరేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆయనపై అనర్హత వేటేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎంతకీ కదలిక రాకపోవడంతో.. రెండో వైపు నుంచి నరుక్కురావడంపై పార్టీ దృష్టిపెట్టింది. అదులో భాగంగానే రెబల్ ఎంపీపై వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల్లో పోలీసు కేసులు పెట్టారు. దీనిపై రఘురామ స్పందించిన తీరుతో వివాదం మరో మలుపు తిరిగినట్లయింది.

అసలేం జరిగిందంటే..
పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామపై గత కొద్ద రోజులుగా ఇబ్బడి ముబ్బడిగా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ మేరకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిలో.. పోడూరు పోలీస్ స్టేషన్లో మంత్రి శ్రీరంగనాథరాజు ఇచ్చిన ఫిర్యాదు, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన కంప్లైంట్ తీవ్రంగా ఉన్నాయి. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా రఘురామ మాట్లాడారని ఎమ్మెల్యే గ్రంధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీలో వర్గ విభేదాలు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెబల్ ఎంపీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై రఘురామ శుక్రవారం స్పందించారు.

అరెస్టు నుంచి రక్షణ కోరుతూ..
రెబల్ ఎంపీపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కేసులు పెడుతోన్న దరిమిలా రఘురామ అరెస్టు తప్పదనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. పొమ్మనలేక పొగబెట్టేలా, సొంత నియోజకవర్గంలోనే కేసులతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేయాలని, తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్లిపోకుంటే పోలీస్ చర్యలకూ దిగాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ ఎత్తులకు ధీటుగా స్పందిస్తోన్న రఘురామ.. అరెస్టుల నుంచి రక్షణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు..
తనపై వైసీపీ నేతలు దాఖలు చేసిన కేసుల్లో పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా, ముందస్తు ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంపీ రఘురామ శుక్రవారం హైకోర్టును కోరారు. ఈ మేరకు రెండు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. భీమవరం, పోడూరు స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణను కోర్టు వాయిదా వేసింది.
Recommended Video

దేవధర్ వ్యాఖ్యలతో బలం?
టీడీపీకి చీకటి స్నేహితుల్లా ఉన్నారని, టీడీపీ మిడతల దండును చేర్చుకుంటున్నారంటై ఏపీ బీజేపీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా పదే పదే విమర్శలు చేస్తూవచ్చారు. దీనికి కౌంటర్ గా ఏపీ బీజేపీ ఇన్ చార్జి దేవధర్ చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. అవే ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామకు కూడా బలం చేకూర్చినట్లు వాదన వినిపిస్తోంది. ‘‘విజయసాయిరెడ్డి.. కేవలం పసుపు రంగునే కాదు...అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్ల ఫేడ్ అయిపోతున్న మీ పార్టీ రంగును కాపాడుకోండి..''అని దేవధర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications