‘ఆ ఫైలుపై కెసిఆర్ సంతకం పెడితే చంద్రబాబు జైలుకేనా?’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటుకేసులో చంద్రబాబు నిందితుడేనని అన్నారు
'ఓటుకు నోటు' కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద శాతం దోషి అని స్పష్టంగా తేలిందని, సంబంధిత ఫైలు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టేబుల్ వద్ద ఉందని చెప్పారు.
ఆ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం పెట్టిన మరుక్షణమే చంద్రబాబు చేతులకు సంకెళ్లు పడటం ఖాయమని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు భయంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనకాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.
శ్రీశైలం డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కారు అనేక అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ జరుగుతున్నాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టులు పూర్తిగా చట్టవిరుద్ధమని, రాష్ట్ర విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని అన్నారు. వీటివల్ల రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని రఘువీరా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.